మానకొండూర్, జనవరి 30 : జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపెల్లి శేఖర్గౌడ్పై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. పూటకో పార్టీ మార్చే ఆయనకు రాజకీయాలపై అవగాహన లేదని, ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఇలా అపహాస్యం చేయడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మానకొండూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన తన సీటు ఏది? అని అడిగిన జడ్పీటీసీపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోలీసులను పురామయించి బలవంతంగా సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకువెళ్లాలని ఆదేశించడాన్ని ఖండించారు. ఇలాంటి చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికీ లేదని విమర్శించారు.
కేవలం మానకొండూర్ నియోజకవర్గంలో మాత్రమే సర్వసభ్య సమావేశాలకు జడ్పీటీసీలు వేదికపై రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు నియోజకవర్గాల్లోనే ఇలా జరుగుతున్నదా..? అని ప్రశ్నించారు. బీసీ జడ్పీటీసీని అగౌరవపరిచేలా ప్రవర్తించిన కవ్వంపల్లిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. తీరు మార్చకోక పోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సిరిసిల్ల జడ్పీవైస్ చైర్మన్ సిద్ధం వేణు, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం జడ్పీటీసీ సభ్యులు తాళ్లపెల్లి శేఖర్గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, ఆశోక్రెడ్డి, పడాల సతీశ్గౌడ్, బోడ రాజశేఖర్, రామగిరి అంజనేయులు, పిండి సందీప్, కొట్టె రఘు పాల్గొన్నారు.