‘రైతులు పంటలు ఎండిపోయాయని అధైర్య పడవద్దు. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంట. నష్టపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని కోరుదాం. మంచి మాటతో వినకపోతే పోరాడుదాం. మీరంతా యుద్ధానికి సిద్ధమా..’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పిలుపు నిచ్చారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన ఎర్రటి ఎండలో మొగ్దుంపూర్తోపాటు బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న గోసను చూసి చలించిపోయారు.
కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పంటలు ఎండిపోయాయని రైతులు అధైర్య పడవద్దని, పోరాటం చేసి నష్టపరిహారం సాధించుకుందామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో రైతులు పొలగాని సంపత్, బండి సంపత్, వేల్పుల నర్సయ్యకు సంబంధించిన పొలాలను పరిశీలించి చలించి పోయారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ఎకరానికి 25వేల నుంచి 30 వేల పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అవి మునిగామని వాపోయారు. మీరు ఎన్ని ఎకరాలు వేశారని పొలగాని సంపత్ను కేసీఆర్ అడుగగా, మూడెకరాలు వేస్తే మొత్తం పోయిందని, పాల పొట్టమీద ఉన్న పంటంతా ఎండిపోయిందని ప్రత్యక్షంగా చూపించాడు.
ఒక్క రెండు తడులైతే పంట చేతికి వచ్చేదని వాపోయాడు. బండి సంపత్, వేల్పుల నర్సయ్యను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్క ఉన్న పొలాలు, ఇతర గ్రామాల రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని స్థానిక తాజా మాజీ సర్పంచ్ జక్కం నర్సయ్య వివరించాడు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ ద్వారా క్రమం తప్పకుండా నీళ్లు వచ్చాయని, మానేరువాగులో జలధార ఎన్నడూ ఎండిపోలేదని గుర్తు చేశాడు. గ్రామంలో ఎన్ని ఎకరాల్లో వరి వేశారని కేసీఆర్ అడుగగా, సుమారు 2 వేల ఎకరాల్లో వేశారని, అందులో 80 శాతం పంటలు నీళ్లు లేక ఎండిపోయాయని చెప్పాడు. నగునూర్, గోపాల్పూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ గ్రామాల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు చెక్ డ్యాంలు నిర్మించిందని, ఆరేండ్ల నుంచి అవి ఎన్నడూ ఎండిపోలేదని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాలేదని కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్ వివరించారు.
ఇప్పుడు చెక్డ్యాంలు పూర్తిగా ఎండిపోయాయని, మానేరు ఒడ్డున ఉన్న పొలాలు కూడా నెర్రెలు బారాయని చెప్పారు. పంటలు ఎండిన విధానాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ కూడా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్లే వ్యవహరిస్తున్నదని, నీళ్లున్నా ఇవ్వలేదని, రెండు తడులు ఇస్తే పంటలన్నీ చేతికి వచ్చేవని రైతులు వాపోతుండగా కేసీఆర్ స్పందించారు. మరీ ఇప్పుడు ఏం చేద్దాం..? యుద్ధం చేద్దామా..? అ ని ప్రశ్నించగా, రైతులు ముక్తకంఠంతో చేద్దామని మద్దతు పలికారు.
అంతేకాకుండా, ఎకరానికి 25 వేల నష్టపరిహారం అడుగుదామని, మంచి మాటతో వినకపోతే పోరాటం చేద్దామని, మీరంతా ఏకం కావాలని రైతులకు పిలుపునివ్వగా.. తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సర్కారు సంగతేందో చూద్దామని, మీరంతా రెడీగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పది వేల మందితో మేడిగడ్డకు వెళ్లి ధర్నా చేద్దామన్నారు. నీళ్లు ఇవ్వడం ఈ రండగాళ్లతో కాదని, వచ్చేతాపకు మనమే వెళ్లి నీళ్లను మలుపుకుందామని, ఎవడన్నా అడ్డం వస్తే అక్కడే చెట్టుకు కట్టేద్దామని స్పష్టం చేశారు.
కేసీఆర్ వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు సర్దార్ రవీందర్సింగ్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు ఉన్నారు.
మొగ్దుంపూర్ పర్యటన తర్వాత సిరిసిల్లకు వెళ్తున్న కేసీఆర్, గంగాధర మండలం కురిక్యాల – కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించి చలించి పోయారు. ‘అయ్యో.. వరద కాలువ పరిస్థితి ఇంత దారణంగా తయారైందా..? ఎండకాలం కూడా నిండుగా నీళ్లతో ఉండేది’ అని ఆవేదన చెందారు. వరద కాలువ పూర్తిగా ఎండిపోయిందని, దీనిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్ని గ్రామాల్లో పంటలు ఎండి పోయాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వివరించగా.. కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సర్కార్ వైఫల్యమనేనని స్పష్టం చేశారు.
డ్యామ్ పకనే ఉన్నా నీటి చుక్క లేక , కరెంటు సరిగ్గా లేక పంట పొలాలు ఎండుతున్నాయని బోయినపల్లిలో కేసీఆర్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగమైందని వాపోయారు. నాలుగేళ్ల నుంచి ఏటా రెండు పంటలు పండించానని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు రమేశ్ గుర్తు చేశాడు. తన రెండెకరాలు మిడ్మానేరుల ముంపునకు గురైందని, ఉపాధి కోసం బోయినపల్లికి వచ్చి పదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని చెప్పుకున్నాడు.
కోరెం కిష్టమ్మ చెరువు నుంచి ఒర్రెలో వచ్చే నీటితో ఎండకాలంల పదెకరాలు పండించానని, ఈ యేడు నీళ్లు రాక మొత్తం ఎండిపోయిందని వాపోయాడు. కరెంట్ సరిగ్గా లేక మోటర్లు కాలిపోతున్నాయని, నీళ్లు రాక పదెకరాల్లో నాలుగెకరాల వరి ఎండిపోయిందని మల్లాపూర్ రైతులు చల్ల వెంకట్రెడ్డి, లక్ష్మారెడ్డి గోడును వెల్లబోసుకున్నారు. ‘సార్ మీ పాలనలోనే బాగుంది. ఇప్పుడు కనీసం నీళ్లు లేవు, సరిగ్గా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నం’ అని బోయినపల్లి చెందిన రైతులు సుధాకర్, నాగరాజు, రమేశ్ చెప్పుకొచ్చారు. వారి బాధలు విన్న కేసీఆర్ ‘మీ కష్టాల్లో నేను పాలుపంచుకుంటా.. కొట్లాడుదామా?’ అని పిలుపినివ్వగా, వారంతా మద్దతు పలికారు.