బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. మంథని, పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థులు పుట్ట మధూకర్, దాసరి మనోహర్రెడ్డికి మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట భారత్ పెట్రోల్ పంపు సమీపంలో, పెద్దపల్లి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సభలు జరగనున్నాయి. కాగా, ఒక్కో సభలో సుమారు 50 వేలు పైగా ప్రజలు రానున్న నేపథ్యంలో పార్టీ నాయకులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
– పెద్దపల్లి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంథని, పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థులు పుట్ట మధూకర్, దాసరి మనోహర్రెడ్డికి మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఒక్కో సభకు సుమారు 50 వేలమంది కదిలి రానుండగా, ఇందుకు అనుగుణంగా సన్నాహకాలు చేశారు. మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట భారత్ పెట్రోల్ పంపు సమీపంలో 12 ఎకరాల స్థలం, పెద్దపల్లి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిలువెత్తు కటౌట్లు పెట్టారు.
చుట్టుపక్కల, వచ్చే దారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికలను గులాబీ తోరణాలతో అలంకరించారు. సభాస్థలాల్లో నీడ కోసం షామీయానాలు వేశారు. వచ్చిన వారు కూర్చునేలా కుర్చీలను సిద్ధం చేశారు. తాగునీటి వసతి కల్పించారు. అత్యపరిస్థితులు ఎదురైతే అవసరం మేరకు అంబులెన్స్లో అందుబాటులో ఉంచారు. సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సభలో పాల్గొననున్న నేపథ్యంలో సభ స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
మంథనిలోని కొత్త ఐవోసీ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న స్థలంలో, పెద్దపల్లిలోని ఐటీఐ కళాశాల మైదానంలో సీఎం హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేశారు. కాగా, సీఎం కేసీఆర్ సభలను విజయవంతం చేసేందుకు 15 రోజుల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలు ఊరూరా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. సభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సభా స్థలాల్లో పెద్దపల్లి, మంథని బీఆర్ఎస్ అభ్యర్థులు దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధూకర్ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు.
గులాబీ దళిపతి, సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాలోని మందమర్రికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆనంతరం తిరిగి హెలికాప్టర్లో మంథనికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని మంథని శివారులోని మంథని-గోదావరిఖని రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మంథని నుంచి హెలికార్టర్లో పెద్దపల్లికి సాయంత్రం 4 గంటలకు చేరుకొని, పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు.