ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం రానే వచ్చింది. ఆదివారం ఉదయం నుంచే నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ మొదలు కాగా, మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకున్నది. మిగిలిన ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ మాత్రం ఖాతా తెరువక పోగా.. ఆ పార్టీలో సీనియర్ నాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ఓటమి పాలయ్యారు.
గెలిచిన వారిలో మాకునూరి సంజయ్ కుమార్, సంజయ్ కల్వకుంట్ల, కవ్వంపల్లి సత్యనారాయణ ముగ్గురూ వైద్యులే కాగా, ఈసారి ఎనిమిది మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కాగా, సిరిసిల్ల గడ్డపై నుంచి ఉప ఎన్నికను కలుపుకొని వరుసగా ఐదోసారి కేటీఆర్, కరీంనగర్ నుంచి వరుసగా నాలుగోసారి గంగుల కమలాకర్ జయకేతనం ఎగురవేశారు. కాగా, కరీంనగర్ అసెంబ్లీ ఫలితం చివరి వరకూ ఉత్కంఠ రేపినా.. చివరకు గంగులే విజయం సాధించారు.
– కరీంనగర్, డిసెంబర్ 3 (నమసే ్తతెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 3 (నమసే ్తతెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గత నెల 30న ముగియగా, ఆదివారం ఓట్లు లెక్కించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేసి, ఫలితాలను ప్రకటించారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని మొత్తం 13 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గెలిచిన వారిలో ఎనిమిది మంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండగా, బీజేపీ నుంచి సీనియర్ రాజకీయ నాయకులు ఓటమి చూశారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి కూడా ఓటమి పాలయ్యారు.
సిరిసిల్ల గడ్డపై నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ వరుసగా విజయాలు అందుకున్నారు. ఉప ఎన్నికలు కలుపుకొని చూస్తే.. ఐదు సార్లు గెలిచారు. నిజానికి 2006 నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కేటీఆర్, 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. మొదటిసారి గెలిచి తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు.
అప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 2010లో రాజీనామా చేసి, ఉప ఎన్నికలు రాగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఎన్నికలోనూ జైకొట్టారు. తాజాగా, ఐదోసారి కూడా రామన్న వెన్నంటే నిలిచారు. దీంతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 29,687 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ గెలుపొందారు.
కరీంనగర్ గడ్డపై హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించిన గంగుల కమలాకర్, తాజాగా నాలుగోసారి విజయం అందుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు విజయం సాధించిన వారు ఎవరూ లేరు. కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, తన 24 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రతి ఎన్నికలోనూ విజయఢంకా మోగిస్తున్నారు.
2000లో కౌన్సిలర్గా, 2005లో కార్పొరేటర్గా గెలిచిన ఆయన, మొదటిసారి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గ చరిత్రలో రికార్డు సృష్టించారు. ఇప్పుడు నాలుగోసారి తన సమీప ప్రత్యర్థి బండి సంజయ్పై 3,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఎనిమిది మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. హుజూరాబాద్ నుంచి గెలిచిన పాడి కౌశిక్రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన విధాన పరిషత్లో అడుగుపెట్టారే తప్ప విధాన సభలో పెట్టలేదు. ఈసారి విజయంతో ఆయన శాసనసభలో అడుగుపెట్టనున్నారు. అలాగే, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మొదటి ప్రయత్నంలోనే విజయం దుందుబి మోగించారు.
వైద్యుడిగా అనుభవం ఉన్న ఆయన రాజకీయ పరంగా పెద్దగా అనుభవం లేకపోయినా.. ఉద్దండులను ఓడించి మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నారు. వీరితోపాటు చొప్పదండి, మానకొండూర్, ధర్మపురి, వేములవాడ, రామగుండం నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్, మక్కాన్ సింగ్ సైతం మొదటిసారి శాసన సభలో అడుగు పెట్టబోతున్నారు.
భారతీయ జనతా పార్టీ ఈసారి ఖాతా తెరువలేదు. అంతటా పరాజయం చెందింది. కరీంనగర్ నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీ చేసిన నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓటమి పాలయ్యారు. వీరితోపాటు సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఓటమి చవిచూశారు.
నిజానికి అందులో ఈ పార్టీ నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్ స్టార్క్యాంపెయినర్లుగా ఉండి ప్రచారం చేశారు. తీరా చూస్తే వారి నియోజకవర్గాల్లోనే ఓటమి పాలయ్యారు. అందులో ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే కాకుండా గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడి పోయారు. హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికలను కలుపుకొని ఏడు సార్లు విజయం సాధించిన ఈటల రెండు చోట్ల ఓడిపోవడం వల్ల రెంటికీ చెడ్డ రేవడిలా అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎక్కువగా మూడు నాలుగు సార్లు ప్రయత్నించిన వాళ్లే ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోసారి ప్రయత్నించి గెలిచారు. ఐదుసార్లు కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయినా ఆయన, ఈసారి విజయం అందుకున్నారు. వేములవాడ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ నాలుగుసార్లు విఫలమై, ఐదోసారి గెలిచారు. 2009లో పెద్దపల్లి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన చింతకింది విజయరమణారావు, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.
తాజాగా, మూడోసారి ప్రయత్నించి విజయం అందుకున్నారు. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, గతంలో మూడు సార్లు పరాజయం పాలయ్యారు. నాలుగోసారి ప్రయత్నించి ఎమ్మెల్యేగా గెలిచారు. మానకొండూర్, చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు.
ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముగ్గురూ వైద్యులే ఉన్నారు. జగిత్యాల నుంచి రెండోసారి గెలిచిన డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ నేత్ర వైద్యుడిగా ఉన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సేవలందిస్తున్నారు. ప్రతి ఆదివారం పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లను చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై రెండోసారి విజయం సాధించారు. కోరుట్ల నుంచి గెలిచిన సంజయ్ కల్వకుంట్ల వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
స్పైన్ సర్జన్ అయిన ఆయన, కొన్నేండ్లుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి అర్వింద్పై ఆధిక్యతతో విజయం అందుకున్నారు. ఇక మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కవ్వంపల్లి సత్యనారాయణ, 30 ఏండ్లుగా వైద్య వృత్తిలో ఉన్నారు. ఎంబీబీఎస్, ఎంఎస్ చేసిన ఆయన, కొంతకాలం ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. దివంగత సీఎం వైఎస్సార్తో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, తన భార్య డాక్టర్ అనురాధ సైతం వైద్యురాలు కావడంతో కరీంనగర్లో కొన్నేండ్లపాటు దవాఖాన నడింపిచారు. అనంతరం ఇక్కడ ప్రాక్టీస్ తీసివేసి హైదరాబాద్లో దవాఖాన నడిపిస్తున్నారు.