చొప్పదండి, (రామడుగు) నవంబర్ 14 : “కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మోసపోతం. మోసపోతే గోసపడుతం.. బీఆర్ఎస్ అంటే వెలుగులు.. కాంగ్రెస్ అంటేనే చీకటి. ఏది కావాలో మీరే ఆలోచించి ఓటేయండి” అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం రామడుగు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బిడ్డనైన తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. గతంలో స్థానికేతరులు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని, తాను పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటున్నానని, ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను విరించారు. బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మరళీకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కృష్ణారెడ్డి, వివేకానంద, నాయకులు పుడూరు మల్లేశం పాల్గొన్నారు.