మల్లాపూర్/ సారంగాపూర్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ఝూటా కోర్ అని, అసత్య ప్రచారం చేసి గెలిచిండని, ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిండని దుయ్యబట్టారు. కాంగ్రెస్, రేవంత్ చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు ఎండగట్టాలని, ఓటుతో బుద్ధి చెప్పేలా చైతన్యం కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మంగళవారం మల్లాపూర్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేఎంఆర్ గార్డెన్స్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సాయంత్రం బీర్పూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడారు.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఒరిజినల్గా ఉండేదని, ఇప్పుడున్నది డూప్లికేట్ అని మండిడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు జీవన్రెడ్డి అడ్డువస్తున్నారనే కారణంతో అధిష్టానం జీవన్రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిధులు తీసుకురాని అసమర్థుడు ధర్మపురి అర్వింద్ అని, ఈ ఐదేండ్లలో చేసింది శూన్యమని, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ప్రజల చెవిలో పూలు పెడితే, కాంగ్రెస్ ప్రజల నెత్తిమీద భస్మాసుర చెయ్యి పెట్టిందని మండిపడ్డారు. నాడు ఎడారిగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేస్తే, సీఎం రేవంత్రెడ్డి వచ్చి మళ్లీ ఎడారి చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో అమలైన పథకాలు, చేసిన అభివృద్ధి పనులపై పార్టీ నాయకులు ప్రజల్లో చర్చ పెట్టాలని, అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేసే వారికే ఓటు వేయాలని, అప్పుడే ఈ ప్రాంత ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని, మీ కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.