వారిద్దరూ భార్యాభర్తలు.. రోజూ కలిసే కూలి పనికి వెళ్లే వారు.. ఒకరికొకరు తోడూ నీడగా బతికారు.. ఉన్నంతలో ముగ్గురు కొడుకులతో హాయిగా జీవిస్తున్నారు. కానీ, అనుకోని రోడ్డు ప్రమాదం ఆ దంపతులిద్దరినీ బలితీసుకున్నది. ఎప్పటిలాగే శనివారం కూలి పనికి బైక్పై బయల్దేరిన భార్యాభర్తలను వెనుక నుంచి లారీ ఢీకొంది. అక్కడికక్కడే ఆ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలువగా, ఏడేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఉదయం నవ్వుతూ వెళ్లిన అమ్మానాన్నలకు ఏమైందో తెలియని దీనస్థితిని చూసి గ్రామస్తులు చలించిపోయారు.
కోరుట్ల, మే 20 : కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన సూర భూమయ్య (33) గతంలో పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. కొన్నాళ్లుగా గ్రామంలోనే ఉంటూ భార్య ప్రేమలత (28)తో కలిసి కాయకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బండ రాయి కొట్టుకుంటూ, పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు భార్యభర్తలద్దరూ కలిసే వెళ్లేవారు. కూలీ పని నుంచి తిరిగి వచ్చే వరకు తమ ముగ్గురు కొడుకులను భూమయ్య తల్లి నర్సవ్వ చూసుకునేది. యథావిధిగా శనివారం కోరుట్లలోని ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు భార్యతో కలిసి భూమయ్య బైక్పై ఉదయమే ఇంటి నుంచి బయల్దేరాడు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో అంబేద్కర్ చౌక్ జాతీయ రహదారి వద్ద బైక్ రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారిపైనుంచి దూసుకుపోయింది. లారీ చక్రాల్లోకి చొచ్చుకుపోవడంతో తల ఛిద్రమై భూమయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య ప్రేమలత పొత్తి కడుపు నుంచి లారీ టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో కరీంనగర్లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూసింది. ప్రమాదస్థలిని సీఐ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. దంపతుల మృత దేహాలకు స్థానిక ప్రభుత్వ దవాఖానలో పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతుల బంధువు రాజం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భూమయ్య, ప్రేమలత దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం తిమ్మాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో కలిసి మెలిసి ఉన్న దంపతులు ఇక లేరని తెలిసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏ పాపం ఎరుగని ముగ్గురు చిన్నారులు హర్షవర్దన్ (7), అన్వేష్ (5), పూజిత్ (3) తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మిగిలి పోయారు. ఏ జరుగుతుందో కూడా తెలియని పసి హృదయాలు తమ తల్లిదండ్రులు ఇక లేరన్న చేదు నిజాన్ని గ్రహించలేక పోతున్నారు. వారి దీన స్థితిని చూసిన స్థానికులు చలించిపోయారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్రనేత కల్వకుంట్ల సంజయ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన భూమయ్య, ప్రేమలత దంపతుల దహన సంస్కారాల కోసం 10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సాయాన్ని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ మృతుల బంధువులకు అప్పగించారు.