మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి13 : ఫోర్జరీ కేసులో మానకొండూర్ మండలం దేవంపల్లికి చెందిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు మానకొండూర్ సీఐ రాజ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దేవంపల్లికి చెందిన బోయిని శంకరయ్య తన ఇంటి నంబర్తో కరీంనగర్ రూరల్ (తిమ్మాపూర్) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది నవంబర్ 8న దాదాపు 10 గుంటల పైబడి రిజిస్ట్రేషన్ను తన కుటుంబ సభ్యుల పేరు మీద చేశాడు.
ఈ సమయంలో పొందుపర్చాల్సిన పత్రాల్లో ఫోర్జరీ చేసినట్లు గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రెటరీ సోమ శాశ్వత మానకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో 10 గుంటల ప్రభుత్వ భూమితోపాటు ఫోర్జరీ చేసినట్లు, శంకరయ్యకు గ్రామానికి చెందిన గుండా అంజనేయులు సహకరించినట్లు ఒప్పుకున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించినందుకు, ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూసిన బోయిని శంకరయ్యతోపాటు గుండా అంజనేయులను పలు సెక్షన్ల కింద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించి జైలుకు తరలించారు. నిందితుల నుంచి నకిలీ ధ్రువ పత్రాలు, గ్రామ పంచాయతీ, సెక్రటరీ పేరిట ఉన్న నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.