Peddapur | మెట్ పల్లి రూరల్, మార్చి 8: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బోనాలను సమర్పించారు. ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లన్న స్వామి రథోత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. కాగా అంతకు ముందు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తదితరులు మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.