కమాన్చౌరస్తా, జూన్ 8: కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు హబ్గా మారనున్నదని, ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట వేంకటేశ్వర స్వామి ఆలయంలో మేయర్ వై సునీల్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేయడమే కాకుండా, కరీంనగర్ జిల్లా మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కొత్తపల్లి సమీపంలోని సీడ్స్ కార్పొరేషన్ షెడ్లకు మరమ్మతులు చేసి తరగతులు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యకు కావాల్సిన లాబ్స్, క్లాస్ రూం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి కాబట్టి రానున్న రోజుల్లో శాశ్వత భవనాలతో వైద్య కళాశాల, 500 పడకల దవాఖానగా మారబోతున్నదన్నారు. ఈ విద్యా సంవత్సరమే కళాశాలను ప్రారంభం చేయాలని మంత్రి గంగుల కమలాకర్, తాను ప్రభుత్వాన్ని కోరడంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చినట్టు తెలిపారు.
వైద్య కళాశాలకు కావాల్సిన ప్రభుత్వ టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకున్నట్లు చెప్పారు. 100 మంది విద్యార్థుల ఇన్ టేక్ అడ్మిషన్స్తో బుధవారం రాత్రి అధికారికంగా అనుమతి వచ్చిందన్నారు. ఇది జిల్లా ప్రజలకు, ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంబంధించిన విషయాలపై మంత్రి గంగుల కమలాకర్, తాను వేగవంగా నిధులు రిలీజ్ చేయించి భవన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుంటున్నట్లు చెప్పారు. మొదటి విద్యా సంవత్సరంలోనే విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పించి, వైద్య విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలలున్నప్పటికీ అదనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం చాలా సంతోషమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే, అన్ని జిల్లాలకు కొత్త మెడికల్ కళాశాలలు 500పడకల దవాఖానలు సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర బిడ్డలకు మంచి వైద్య విద్య అందబోతున్నదని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలోనే ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మొత్తం 55 ఉండడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని మెడికల్ కళాశాలలు లేవని చెప్పారు.
కేంద్రం ఒక్క కళాశాల కూడా ఇవ్వలేదు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గతంలోనే వివిధ రాష్ట్రాలకు 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక కళాశాల మంజూరు చేయలేదని విమర్శించారు. నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజానీకానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కళాశాలలకు ఇవ్వక పోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడితే ఇప్పటికీ ఒక నవోదయ విద్యాలయాలు మంజూరు చేయలేదన్నారు. దీంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్య తరగతి పిల్లలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పని చేసిన కాలంలో కరీంనగర్ జిల్లాకు ట్రిబుల్ఐటీ కావాలని కేంద్రాన్ని కోరితే ఇస్తా అని హామీ ఇచ్చి ఇతర రాష్ట్రానికి తరలించారని తెలిపారు. జిల్లాకు ట్రిబుల్ ఐటీని తప్పకుండా సాధించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయం చైర్మన్ అనిల్గౌడ్, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, పిల్లల వినోద శ్రీనివాస్, కోల మాలతి, గుగ్గిల్ల జయశ్రీ పాల్గొన్నారు.