సిరిసిల్ల టౌన్/ ముస్తాబాద్, మార్చి 19 : వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు పది వేల చొప్పున పరిహారం అందంచాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్తోపాటు మండలంలోని పోతుగల్, సేవాలాల్తండా, గన్నెవానిపల్లె, తంగళ్లపల్లి మండలం ఓగులాపూర్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీంచారు. రైతులను వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిరిసిల్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. మొన్నటి వరకు సాగునీరు లేక పంటలు కోతలకు వచ్చే సమయంలో రైతులు చాలా నష్టపోయారని గుర్తుచేశారు. కొందరు కడుపు మండి పశువులను మేపారని, మరికొందరు పంటలకు అగ్గి పెట్టారని ఆవేదన చెందారు. ఈ సమయంలోనే ప్రకృతి కన్నెర్రచేసి వడగండ్ల వాన మరింత కుంగదీసిందన్నారు.
రైతుల పరిస్థితి మరింత దిగజారకముందే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలను తక్షణమే సర్వే చేయించి, రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఫోన్ ద్వారా కోరారు. పంటపొలాలకు కాలువల్లో మోటర్లు వేసుకుని నీళ్లుపారించుకున్న గన్నెవానిపల్లి, సేవాలాల్తండా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ అంశంపై వెంటనే స్పందించాలన్నారు. వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ప్రభుత్వం విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆర్బీఎస్ మాజీ అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అకరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, తన్నీరు గౌతమ్రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, రాచమడుగు సంతోష్రావు, రమేశ్రెడ్డి, చెవుల మల్లేశ్యాదవ్, ఎల్లం, మనోహర్, స్వామి, వెంకటేశ్ ఉన్నారు.
ఎల్లయ్య కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్లో భారీ వృక్షం విద్యుత్తీగలపై పడి స్తంభం కూలి ఎల్సాని ఎల్లయ్య మృతి చెందగా, మంగళవారం ఆ ప్రాంతాన్ని వినోద్కుమార్ పరిశీలించారు. అనంతరం ఎల్లయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణమే 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లయ్య కుటుంబాన్ని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో కోరారు.