బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మన బలం, బలగమనీ స్పష్టం చేశారు. మానకొండూర్ మండలంలోని గంగిపల్లి గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం, అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
– మానకొండూర్, ఏప్రిల్ 16
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మన బలం, బలగమనీ స్పష్టం చేశారు. మానకొండూర్ మండలంలోని గంగిపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ జెండాతో 22 ఏండ్లుగా తిరుగుతున్నామనీ, నాడు తెలంగాణ రాక పూర్వం పోలీసోళ్ల బూట్ల చప్పుళ్లు, బయట పడుకునే పరిస్థితే లేదని గుర్తు చేశారు. పల్లెల్లో అలజడి, నక్సలైట్లమనీ, రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగిన రోజులు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు.
బావుల్లో నీరు లేక, కరెంటు లేక పంటలు ఎండిపోయిన చరిత్ర అప్పటిదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. నేడు 24 గంటల కరెంటు కేవలం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉందా? అన్ని ప్రశ్నించారు. నాడు రూ.200 పెన్షన్ ఉంటే, నేడు రూ.2 వేలు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప పథకాలైన రైతు బంధు, ధాన్యానికి మద్దతు ధర, రైతు బీమా కల్పించిన విషయం మీకు తెలియనిది కాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. జయశంకర్ ఆశయ సాధనలకు మనమంతా కృషి చేయాలని యువకులకు, అక్కాచెల్లెళ్లకు సూచించారు. కొందరు మతం పేరిట, రాజకీయం చేస్తున్న విషయాన్ని మరవద్దన్నారు. నాడు తాను ఎంపీగా ఉండగా త్రిపుల్ ఐటీ తీసుకొచ్చినది తప్ప మన ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమన్నా కాలేజీ తీసుకొచ్చాడా?, రైల్వే లైన్లు తీసుకొచ్చాడా? అని నిలదీశారు. పేద ప్రజల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ మాత్రమేనని, బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై గ్రామాల్లో చర్చించాలని, చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో దేశం ముందుకు పోవాలంటే యువకులు ముందుండాలన్నారు. అనంతరంఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లా డుతూ రానున్న రోజుల్లో గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు.
గ్రామంలో ఇప్పటికే అన్ని మౌళిక వసతులను కల్పించామని వివరించారు. కావాల్సి న వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు న్నామని పేర్కొన్నారు. మానకొండూర్ మండలానికి 100 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూ రైనట్లు చెప్పారు. వాటిని అర్హులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామానికి రూ. 2కోట్లు అందించామని వెల్లడించారు. కాగా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది నాయకులు, యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మొదటగా గ్రామానికి చేరుకున్న ముఖ్య నాయకులు, నాయకులకు డప్పు చప్పుళ్లతో, కోలాట నృత్యాలతో, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పూల చల్లుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపలి శేఖర్ గౌడ్, సర్పంచ్ మాశం శాలిని-సాగర్, ఎంపీటీసీలు రంగు భాస్కరాచారి, చలిగంటి సంపత్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, కరీంనగర్ కార్పొరేటర్ వాల రమణారావు, రైతు బంధు మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, మానకొండూర్ సొసైటీ అధ్యక్షుడు నల్ల గోవింద రెడ్డి, ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ వాల అంజిత్ రావు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఇడుమాల సంపత్, యాదవ సంఘం అధ్యక్షుడు రాధారపు సంపత్, మున్నూరుకాపు సం ఘం మండలాధ్యక్షుడు కడారి ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు శనిగరం సంపత్, రెడ్డి సంఘం అధ్యక్షుడు డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు తిరుపతి గౌడ్, యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం మండలాధ్యక్షుడు జెట్టి కొమురెల్లి, జినుక రాజ్ కుమార్, రాఖేష్, కొమురయ్య మహేశ్, పరశురాములు, బీఆర్ఎస్ శ్రేణులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదోళ్ల కోసం ఆలోచించే దేవుడు కేసీఆర్
రైతు చనిపోతే బీమాను అందిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్దే. పేదోళ్ల బతుకుల కోసం ఆలోచించే దేవుడు కేసీఆర్ ఒక్కడే, సద్దన్నం తినేటోళ్లు దేవున్ని తలవాలి అన్నట్లు కేసీఆర్ను తలవాలి. బండి సంజయ్ ఎంపీ అని కూడా ఎవరికీ తెలియదు. అభివృద్ధికి ఏమన్నా నిధులు తీసుకొచ్చిండా.? రానున్న రోజుల్లో దళిత బంధు పథకంలో గంగిపల్లి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తాం. హైదరాబాద్లో నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు చూసి రావాలె. అంబేద్కర్ అందరి వాడు.
– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
బండి సంజయ్, కవ్వంపల్లి మాటలు నమ్మొద్దు
కరీంనగర్లో మెడికల్ కాలేజీ వస్తుండడంతో అక్కడ ఉన్న విత్తనోత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మించేలా రైతుల పక్షాన ఆలోచించే గొప్ప వ్యక్తి బోయినపల్లి వినోద్కుమార్. సమస్యను అప్పటికప్పుడే పరిష్కారమయ్యేలా తోడ్పడేలా సేవలందిస్తుంటారు. అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లు ఉంటారు. బండి సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ మాటలు నమ్మవద్దు. పదో తరగతి పేపర్ లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందనే విషయం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుసు.
జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు