ఎలారెడ్డిపేట, సెప్టెంబర్ 17: భవిష్యత్తులో చిన్న కమతాల్లో ఆధునిక సేద్యానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమేర్పడుతుందని, అందుకు సహకార సంఘాలే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం అల్మాస్పూర్లో ప్రాథమిక సహకార సంఘం-ఐవోసీ భాగస్వామ్య పెట్రో లు బంకును నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వరి నాట్లు వేసే యంత్రాలు, డ్రోన్లు సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసి రైతులు వినియోగించుకునే అవకాశాలుంటాయ ని తెలిపారు. మహారాష్ట్రలో మంత్రుల కంటే సహకార సంఘం ప్రతినిధులకే ప్రాధాన్యముందని, ప్రతీ కుటుంబానికి అందుబాటులో ఉండే అవకాశం వాటి ద్వారా దక్కుతుందని చెప్పారు.
అక్కడ పాఠశాలలు, కళాశాలలు, రైస్మిల్లులు, పెట్రోలు బంకులు, షుగర్కేన్ ఇండస్ట్రీలు సహకార సంఘాలే నడుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకు ముందు దుమాలలో రూ.23. 75లక్షలతో నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోడౌన్ను వినోద్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇక్కడ రాష్ట్ర టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, గుగులోత్ కళావతి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ చాంద్పాషా, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచులు రాధారపు పుష్పల, కదిరె రజిత, ముక్క శంకర్, అల్మాస్పూర్ సొసైటీ డైరెక్టర్లు, ఐవోసీ ప్రతినిధులు ఉన్నారు.