“కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసగాళ్లు.. 50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను చీకటిమయం చేసింది. పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసిన రాష్ర్టాన్ని దొంగల చేతిలో పెట్టొద్దు. కేసీఆర్ లేని తెలంగాణను ఆగం చేస్తరు. నేను అభివృద్ధి చేస్తుంటే.. ఎంపీ బండి సంజయ్ విధ్వంసం కోరుకుంటున్నడు. ఆయన ఎంపీగా గెలిచినంక అందరినీ దోచుకున్నడు. ఇప్పుడు ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైండు. మేం చేసిన అభివృద్ధిని చూడండి. బీఆర్ఎస్ను ఆశీర్వదించండి” అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కోరారు. శనివారం ఉదయం కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, ఫకీర్పేట్, జూబ్లీనగర్ గ్రామాలు, సాయంత్రం కరీంనగర్లోని 44, 45, 26 డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, నవంబర్ 18
కరీంనగర్ రూరల్: నవంబర్ 18 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, ఫౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ మండలంలోని దుబ్బపల్లి, ఫకీర్పేట, జూబ్లీనగర్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున తరలివవచ్చి, బొట్టు పెట్టి, మంగళహారతులు పట్టి డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేళ్ల నుంచి ఒక్క గ్రామానికీ వచ్చింది లేదని, మళ్లీ ఎన్నికలు రాగానే మాయ మాటలు చేప్పేందుకు వస్తున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, ఓటు వేయించుకొని మాయమవడం తప్ప వారు చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. తాను ఎల్లప్పుడూ ప్రజల కళ్ల ముందే ఉన్నానని, ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటున్నానని గుర్తు చేశారు.
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మన బతుకులు చీకటిమయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలనీ, తెలంగాణకు దోచుకునేందుకు వస్తున్నారనీ, వారి మాటలు నమ్మితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందనీ, కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా సీమాంధ్ర నాయకులతో కలుస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ లేని తెలంగాణ అగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, గ్రామంలోని దళితులందరికీ దళితబంధు పూర్తిగా ఇస్తానని, మిగిలిన వారందరికీ బీసీబంధు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఫకీర్పేట- నగునూర్, జూబ్లీనగర్-ఫకీర్ ఫేట, చామనపల్లి-ఫకీర్పేట, చాకుంట – జూబ్లీనగర్ వరకు రోడ్లు నిర్మించామని, దుబ్బపల్లిలో నూతన గ్రామ పంచాయతీ నిర్మిస్తున్నామని, గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పీ శ్యాంసుందర్రెడ్డి, సర్పంచులు సిరిగిరి దుర్గ, కటకం నందయ్య, రుద్ర భారతి, రాములు, ఎంపీటీసీ చల్ల రామక్క, లింగారెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, దాడి సుధాకర్, జువ్వాడి రాజేశ్వర్రావు, పెద్ది రమేశ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్రెడ్డి, గాండ్ల కొమురయ్య, పబ్బతి రంగారెడ్డి, వొల్లాల సుదర్శన్రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు సొంరెడ్డి మునిరెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.