పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 25 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సంకల్ప యాత్ర అట్టర్ప్లాప్ అయింది. రాష్ట్రస్థాయి నాయకత్వానికి తోడు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా వచ్చినా స్పందన కరువైంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా సబ్బితం మీదుగా జిల్లా కేంద్రం దాకా సాగిన యాత్ర జనం లేక, సొంత పార్టీ శ్రేణులే హాజరుకాక వెలవెలబోయింది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ మధ్య వర్గపోరుతో పెద్దపల్లి సెగ్మెంట్ నేతలు ఎటూ తేల్చుకోలేకనే డుమ్మాకొట్టినట్లు ప్రచారం జరుగుతున్నది.
అయితే, మంథని నియోజకవర్గానికి చెందిన నేత పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో కేవలం ఆ ప్రాంతానికి చెందిన యువకులు, నాయకులే పాల్గొని కాస్త పరువు కాపాడారని, లేదంటే యాత్రలో ప్రముఖులు తప్ప శ్రేణులు కనిపించేవారు కాదనే టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉండగా, విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి పట్టణంలోకి ప్రవేశించే క్రమంలో శాంతినగర్ రైల్వే ఫ్లైఓవర్ వద్ద వాహనాలను చాలాసేపు నిలిపివేయడం ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో పలువురు పోలీసులతో గొడవ పెట్టుకోవడం కనిపించింది.