సబ్కా ధోఖా.. సబ్కా లూట్
మోదీ పాలనలో దేశం అధోగతి
చేసిన మంచి కన్నా ముంచిందే ఎకువ
తెలంగాణకు ప్రతి విషయంలోనూ అన్యాయమే..
సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు
మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారు
రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ అంటూ ప్రజలను బీజేపీ మభ్యపెడుతున్నది. కానీ, ఆ పార్టీ అంటేనే ‘సబ్కా ధోఖా.. సబ్ కా లూట్’. డబుల్ ఇంజిన్ పాలన అని చెప్పుకొనే రాష్ర్టాల్లో సైతం ఇక్కడ జరిగే పథకాల్లో ఒక్కటీ అమలు కావడం లేదు. తెలంగాణ పాలనకు సాటి వచ్చే రాష్ట్రం ఒక్కటీ లేదు. అది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హా రాక సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. మోదీకి దమ్ముంటే ఇక్కడ అమలవుతున్న పథకాల కంటే గొప్పవి ఏం చేస్తున్నారో చెప్పాలి. దేహ సౌందర్యంపై కాకుండా దేశ సౌందర్యంపై ప్రధాని దృష్టి సారించాలి. ‘భారత్ మాతాకీ జై.. జై శ్రీరామ్’ నినాదాలు ఒక్క బీజేపీకి చెందినవి కావు. ఇవి సార్వజనీనమైనవి.
జగిత్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీకి ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడే నైతికత లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, బీజేపీ అంటేనే ట్రబుల్ ఇంజిన్ అని ఎద్దేవా చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మోదీ తెలంగాణకు నష్టం కలిగిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రం అవతరించిన వెంటనే, విభజన చట్టానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టులను ఆంధ్రాలో కలుపుతూ తొలి ద్రోహం చేశారన్నారు. విభజన చట్టంలో చెప్పిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారాలను, ఒక నవోదయ పాఠశాలను, సైనిక్ సూల్ను ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు.
దేశవ్యాప్తంగా 154 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ తెలంగాణకు ఒకటి కూడా మంజూరు చేయలేదన్నారు. తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును సైతం రద్దు చేసిన ఘనత ప్రధాని మోదీదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశంలోనే తెలంగాణ నాలుగో ఆర్థిక చోదక శక్తి అని, ఆర్బీఐ, తెలంగాణ అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శ ప్రాయమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ వంటి సంస్థలు చెప్పినా ఒక రూపాయి కూడా మంజూరు చేయని ద్రోహి ప్రధాని మోదీ అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోహం చాటేశారన్నారు. హైదరాబాద్లోని లషర్లో తెలంగాణకు చెందిన భూమిని రక్షణ వ్యవస్థ పేరిట తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అకడ డిఫెన్స్ కారిడార్ను ఇవ్వాలని కోరినా పట్టించుకు న్న పాపాన పోలేదన్నారు.
ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇంతవరకు దానిపై మోదీ ఎందుకు ఊసెత్తడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణిగా మారి పంట పండిస్తే వడ్లు కొనేది లేదని రైతులను దొంగ దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని పురిటిలోనే చంపాలని కుట్ర చేసిన కపట ప్రధాని మోదీ అని మండిపడ్డారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తో తెలంగాణ అభివృద్ధి పథంలో పోతుంటే మోదీకి మనసు పట్టడం లేదన్నారు. ఆయన పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. రూపాయి మారక విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పతనమైందని తెలిపారు. నిరుద్యోగిత రేటు 8 నుంచి 21శాతానికి చేరిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ ఈ ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలను కల్పించారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయన్నారు.
ప్రతి నిత్యావసర వస్తువు కొనుగోలుదారుడికి భారంగా మారిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయంలో రూ.4 లక్షల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు రూ.80 లక్షల కోట్ల అప్పులోకి చేరిందన్నారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన నరేంద్ర మోదీ, తెలంగాణ అప్పుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల కంటే తెలంగాణ ఒక్కరూపాయి కూడా అధికంగా అప్పు చేయలేదని లెక్కలు చెబుతున్నా అనవసరంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి, జడ్పీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు వొద్దినేని హరి చరణ్రావు, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.