కార్పొరేషన్, డిసెంబర్ 11: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా బీజేపీ తెలంగాణలో గెలువదు.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు.. బీఆర్ఎస్ నాయకులను రావాలని ఆయన పిలవడమే ఇందుకు నిదర్శనం’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ సంగ్రామ యాత్రకు ఆదరణ కరువైందని అందుకే ఇష్టమచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రోజురోజుకూ బలపడుతున్నదని చెప్పారు. బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. అందుకే ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చి సీట్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు.
దేశంలో గత 67 ఏళ్ల పాలనలో 60 లక్షల కోట్ల అప్పులు చేసి ఇండస్ట్రీలు, సంస్థలు నెలకొల్పి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే, మోదీ తన 9 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పు చేసి సామాన్యులపై భారం మోపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు?. ప్రస్తుతం సగటు పౌరుడిపై రూ.5.50 లక్షల అప్పు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, ఎన్ని ప్రాజెక్ట్లు కట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏమి చేయలేని మోదీ ప్రభుత్వం బడా వ్యాపారులకు మాత్రం రూ.14 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా అంటే అప్పులు చేయడమేనా అని నిలదీశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారో, ఎన్ని నిధులు తీసుకువచ్చారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ పేరిట ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఐలేందర్యాదవ్, వాల రమణారావు, గంట కళ్యాణి, మహేశ్, నాయకులు అర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, కర్ర రాజశేఖర్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బాలరాజు, శ్రీనివాస్, మహేశ్ పాల్గొన్నారు.