స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొంత మంది నాయకులకు కంటగింపుగా ఉందని, ఈ ఎనిమిదేళ్లలో సృష్టించిన సంపదను, కట్టిన ప్రాజెక్టులను, ఇతర వనరులను కొల్లగొట్టి.. ఆంధ్రాకు తరలించే కుట్రలు, కుతంత్రాలకు మళ్లీ తెరలేపుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా విమర్శించారు. గురువారం కరీంనగర్లోని మీ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలు, ఇతర నాయకుల వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. బానిస సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే కాదు.. కేవలం ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి సంపదను సృష్టిస్తూ వాటిని సంక్షేమ రంగానికి వినియోగిస్తున్న సీఎం కేసీఆర్కు తప్ప ఈ గడ్డపై మరో పార్టీకి, వ్యక్తికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. వేరు వేరు ప్రాంతాలనుంచి వేరు వేరు వేషాల్లో వస్తున్న నాయకులంతా బీజేపీ దూతలేనంటూ విమర్శించారు.
కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నింటా అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ వనరులను మళ్లీ దోచుకెళ్లేందుకు కొందరు నాయకులు కుట్రలు పన్నుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
కరీంనగర్లోని మీసేవా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని, వాటి ఫలితంగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి వే టలాది కంపెనీలు తరలి వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఫలితంగా సంపద పెరుగుతుందన్నారు. దేశంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్న రా ష్ర్టాల్లో తెలంగాణ ఒకటి కావడం దీనికి నిలువెత్తు నిదర్శనమన్నారు. సుమారు రూ.3.60 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ చెల్లిస్తున్నామని చెప్పారు.
ఇదే కాకుండా.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను అనతి కాలంలో కట్టి అన్నదాతలకు అండగానిలుస్తున్నారని, ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడులు రెండింతలు పెరిగాయని, దీనివల్ల సంపద పెరుగుతున్నదని వివరించారు. ఇవే కాకుండా దేశంలో ఎక్కడా లేని పథకాలు రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఇవేకాకుండా 24 గంటల కరెంటు, టీఎస్ బీపాస్ వంటి సంస్కరణలు తేవడం వల్ల దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్ వస్తున్నాయన్నారు. ఫలితంగా సందప పెరిగి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రిపై నమ్మకం పెరిగిందన్నారు.
నాడు వ్యతిరేకం.. నేడు తీపి మాటలు
నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అత్యధిక సంపదతో ఉందని, ఇందుకోసం ఆనాడే కన్నేసిన సీమాంధ్రులు 1956లో విలీనం చేసుకొని తెలంగాణ సంపందను, నీళ్లు, నిధులను కొల్లగొట్టి ఆంధ్రాకు తరలించారని మంత్రి విమర్శించారు. ఆ బానిస సంకెళ్ల నుంచి బయట పడేందుకు 66 ఏండ్లపాటు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్.. తెలంగాణ సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల స్వరాష్ట్రంలో సృష్టించుకున్న సంపదను, కల్పించుకున్న నీటి వనరులను, ఉత్పత్తి చేసిన విద్యుత్ను, సృష్టించుకున్న బొగ్గు, ఇతర వనరులపై కొంత మంది సీమాంధ్రుల కన్ను పడిందన్నారు. ఆ మేరకు.. తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసి.. ప్రజలను అయోమయం చేసి నిధులను, వనరులను కొట్టగొట్టేందుకు కుట్రలకు పూనుకుంటున్నారని తెలిపారు. నిజానికి దివంగత వైస్సార్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడమే కాకుం డా, పాస్పోర్టు తీసుకొని పక్కరాష్ర్టానికి వెళ్లాలంటూ మాట్లాడారని, అతని కూతురు వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ గడ్డపై నీతి మాటలు చెప్తూ పాదయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే కోవలో పవన్కళ్యాణ్ కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిస్తామని చెప్పగా.. కేఏ పాల్ లాంటి వారు ఆదేబాటలో పయనిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి చాలవన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగారని విమర్శించారు.
బుధవారం ఖమ్మంలో నిర్వహించిన సభలో తెలంగాణలో పార్టీని పునర్నిర్మాణం చేస్తామంటూ చెప్ప డం దేనికి సంకేతమో తెలంగాణ ప్రజలు ఆలోచేన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని వీడిపోయిన తమ్ములంతా రావాలంటూ ఆయన పిలువునివ్వడం చూస్తే.. ఆయన కుట్రలు బహిర్గతం అవుతాయని, అయితే.. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపే వరకు తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తేలేదని పేర్కొంటూ చంద్రబాబు 2014 లో కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేశారని, ఆయన ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి.. ఆ ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిందని గుర్తు చేశారు. బుధవారం ఖమ్మంలో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఆ ఏడు మండలాల గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరాలకు తగ్గట్టుగా రంగు లు మార్చడం చంద్రాబుకు అలవాటన్న విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు తన డ్రామాలు మానుకోవాలని హితవుపలికారు. రెండు రాష్ర్టాలు కలుపడానికి మేం సిద్ధమంటూ వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిధి ఒక వైపు ప్రకటించడం, ఆ మేరకు.. ఆ ప్రాంత నాయకులంతా తెలంగాణలో రాజకీయ కుట్రలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.
బీజేపీ దూతలే
ఆయా పార్టీలు, నాయకులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాల వెనుక బీజేపీ హస్తం ఉందని మంత్రి విమర్శించారు. మోదీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్కు అనుగుణంగానే అన్ని పార్టీలు తెలంగాణపై ఒకరకంగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. నిజానికి వేరు వేరు రూపాల్లో వస్తున్న వీరంతా ఒకే గూటికి చెందిన వారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు. అంతేకాదు.. వేషాలు వేరైనా.. అందరూ బీజేపీ దూతలే అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో దగా పడిన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు ప్రాణం పోసుకొని ప్రగతితో పరుగులు పెడుతుందన్నారు.
ఈ నేపథ్యంలో.. కట్టు కథలు చెపుతూ.. ప్రజలను నమ్మించి వంచించే ఆయా పార్టీల మాటలు నమ్మవద్దన్నారు. ఏమాత్రం నమ్మినా తిరిగి 1956 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తారని పేర్కొన్నారు. కష్టపడి సృష్టించుకున్న సంపదను, వనరులను దోచుకెళ్తారని, ఆదే జరిగితే తెలంగాణ బిడ్డలకు మళ్లీ దుబాయి వంటి దేశాలే దిక్కవుతాయన్నారు. ప్రాజెక్టులను చెరబడితే మన ప్రాంతం మ ళ్లీ ఎడారి అవుతుందన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతూ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న పార్టీలను పారదోలినప్పుడే తెలంగాణ మరింత సుభిక్షంగా ముందుకు వెళ్తుందని సూచించారు. విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ నాయకులు వాసాల రమేశ్, జమీలొద్దీన్, హరిశంకర్ పాల్గొన్నారు.