ధర్మపురి, మే 3: బుగ్గారం మండలం మద్దునూర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్కు చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వివేక్ మాట్లాడబోగా, అక్కడున్న రైతులు తిరగబడ్డారు. ‘ఓ సారూ.. మా సర్కారు తడిసిన వడ్లు కొంటా అన్నది కదా..? మల్ల నువ్వు గిక్కడికెందుకచ్చినవ్.. ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది..? అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభు త్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన తర్వాత బీజేపీ రాజకీయం చేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. బుగ్గారం ఎంపీపీ బాదినేని రాజమణి బుగ్గారం మండలం మద్దునూర్లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని పరిశీలించిన సందర్భంగా మంత్రి ఈశ్వర్ ఎంపీపీకి ఫోన్ చేసి రైతులతో మాట్లాడారని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారని మంత్రి ఈశ్వర్ భరోసా ఇచ్చారని రైతులు వివేక్తో చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం కొంటున్నారని, ఇందుల మల్ల రాజకీయం జేసుడేందని వివేక్ను నిలదీశారు. దీంతో వివేక్ పొంతనలేని మాటలు మాట్లాడి, కాసేపటికే తోక ముడిచి వెళ్లిపోయారు.
గతంలో సొంత పార్టీ నాయకుల తిరుగుబాటు
వివేక్పై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే తిరుబడుతుండగా..ఇప్పుడు రైతులు తిరగబడ్డారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్ సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జనవరి 7న ధర్మపురిలో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగిన సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్యను స్టేజీమీదకు ఆహ్వానించలేదని, ఆయన వర్గం అప్పుడు భగ్గుమన్నది. వివేక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. అప్పుడు కార్యకర్తలే వివేక్తో వాగ్వాదానికి దిగారు. ఆయన తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా రైతులు తిరగబడడం ధర్మపురి నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
ఆది నుంచీ అదే తీరు
నిజానికి వివేక్ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీలోని సీనియర్లను, పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనబెట్టడం అయన రివాజే అన్న విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్లో పనిచేసే సమయంలోనూ అదే పంథాను అవలంబించారు. దీంతో చాలాసార్లు ఆయన వ్యవహార శైలిపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదేవిధానంతో ముందుకుసాగారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అప్పుడు ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీజేపీలోనూ అదేపంథాను అవలంబిస్తున్నారు. కాగా మద్దునూర్లో రైతులు వ్యతిరేకించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.