ఐదారు నెలల క్రితం వరకు హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో తల్లి అయిన మురిపెంతో బాలింతల చిరునవ్వులు.. కెవ్వుకెవ్వు మంటూ పసి పిల్లల కేరింతలతో ప్రసూతి వార్డు కలకళలాడేది. వార్డు సరిపోక మరో వార్డులో సర్దుబాటు చేసిన దృశ్యాలు కనిపించేవి. ప్రస్తుతం ఆ ప్రసూతి వార్డు కళతప్పింది. ప్రసవం కోసం వచ్చే గర్భిణుల సంఖ్య తగ్గడంతో వెలవెలబోతున్నది. గతేడాది వరకు నెలకు సరాసరి 185 వరకు ఉన్న ప్రసవాల సంఖ్య క్రమేపీ తగ్గుతూ సగానికి పడిపోయే దశకు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో కేవలం 105, ఏప్రిల్లో 101 డెలివరీలు మాత్రమే కావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. – హుజూరాబాద్ మే 26
సర్కార్ దవాఖాన అంటే పోస్టుమార్టం చేయడానికి మాత్రమే అనే భావన నెలకొన్న పరిస్థితులు నుంచి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హుజూరాబాద్ దవాఖాన కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నది. ప్రైవేట్ దవాఖాన దోపిడీకి అడ్డుకట్ట వేసి, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ సర్కారు 2017లో కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టడంతో ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు గణనీయంగా పెరిగాయి.
2017లో 297 డెలివరీలు కాగా, 2018లో 333, 2019లో 839, 2020లో 2218, 2021లో 2254, 2022లో 1900, 2023లో 1952 జరిగాయి. వీరందరికీ అప్పుడు కేసీఆర్ కిట్ అందజేశారు. కేసీఆర్ కిట్ మాదిరిగానే ప్రస్తుతం వేరే కిట్ అందిస్తున్నా.. గతంలో మాదిరిగా వెంటనే ఇవ్వడం లేదు. 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని బాలింతలు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు తగ్గాయని లెక్కలను బట్టి తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో 110, ఫిబ్రవరిలో 99 మార్చిలో 105, ఏప్రిల్లో 101 కాన్పులు మాత్రమే అయ్యాయి.
సర్కారు దవాఖానాల్లో డెలివరీలు తగ్గుముఖం పడుతుండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా ప్రభుత్వం వైద్యులను తొలగించింది. ఇందులో ఇద్దరు గైనాకాలజిస్టులు, ఇద్దరు అనస్థీషియా వైద్యులు ఉన్నారు. వీళ్లు ఎన్హెచ్ఆర్ఎం కింద ఔట్సోర్సింగ్లో పని చేసేవారు. ఓ వైపు ప్రసవాలు తగ్గుతున్న క్రమంలో వైద్యులను తొలగించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైద్యుల తొలగింపు వల్ల మున్ముందు డెలివరీల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉన్నది. సేవలు సైతం గతం కంటే తగ్గడంతో గర్భిణులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
ఈమె పేరు ఎల్కపల్లి ప్రియాంక. శంకరపట్నం మండలం రాజాపూర్. ఈమెకు మూడేళ్ల క్రితం బాబు, ఏడాది క్రితం హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో మరో బాబు పుట్టాడు. రెండు సార్లు కేసీఆర్ కిట్ అందుకున్నది. డెలివరీ జరిగి వార్డుకు పంపించిన వెంటనే అధికారులు కిట్ అందించారు.
ఈమె పేరు గొరిగె ప్రత్యూష. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్. నాలుగు రోజుల క్రితం హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు వారిద్దరికీ అవసరమున్న వస్తువుల కిట్ అందలేదు. మూడేండ్ల కిందట ఇదే దవాఖానలో ఈమెకు డెలివరీ కాగా పాప పుట్టింది. అప్పుడు వెంటనే కేసీఆర్ కిట్ను అధికారులు అందజేశారు.
మూడేండ్ల కింద ఇదే దవాఖానకు నేను డెలివరీకి వచ్చాను. అప్పుడు వైద్యులు, సిబ్బంది వెంటనే స్పందించి మంచిగ చూసుకున్నరు. వెంటనే కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నా కిట్ ఇవ్వలేదు. ఒక్కటి నిజం చెబుతున్న అప్పటిలెక్క ఇప్పుడు లేదు.
– సరిగొమ్ముల రజిత, మొగుళ్లపల్లి
ప్రతి ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్లు చేస్తున్నరు. అందుకే డెలివరీల సంఖ్య తగ్గింది. తల్లి, పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువులు ఉన్న ప్రభుత్వం అందించే కిట్ కొంచెం ఆలస్యమైనా అందరికీ అందజేస్తున్నాం. ఎన్హెచ్ఆర్ఎం కింద ఔట్సోర్సింగ్లో పని చేసే వైద్యులను ప్రభుత్వం తొలగించింది. దీంతో సిబ్బంది కొరత ఉంటున్నది.
– రాజేందర్రెడ్డి, సూపరిండెంటెంట్