ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును సరి చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అమలవుతున్న ఈ విధానంతో సత్ఫలితాలు వస్తుండగా, మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వచ్చే నెల నుంచే ఈ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర టెక్నికల్ సర్వీస్ లిమిటెడ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కరీంనగర్ జిల్లాలో 623, రాజన్న సిరిసిల్లలో 472 పాఠశాలల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సమయానికి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా అన్ని జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఈ విధానం అమలులో ఉన్న ది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లిలోనూ గతేడాది నుంచే అమలవుతోంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చే నెల 1 నుంచి ఈ విధానం అమలులోకి రా నుంది. కరీంనగర్ జిల్లాలో 149 ఉన్నత పాఠశాలలు, 76 ప్రా థమిక ఉన్నత పాఠశాలలు, 426 ప్రాథమిక పాఠశాలల చొప్పున మొత్తం 651 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,693 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా లో పూర్తిగా విద్యార్థులు లేని పాఠశాలలు 28 ఉన్నాయి. మిగతా 623 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 114 ఉన్నత పాఠశాలలు, 38 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 337 ప్రాథమిక పాఠశాలల చొప్పున మొత్తం 489 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,304 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, 472 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఇది అమలు చేడం వల్ల ఉపాధ్యాయుల అటెండెన్స్ సెంట్రలైజ్డ్ అవుతుంది. దీంతో ఏ టీచర్ ఏ సమయానికి పాఠశాలకు వస్తున్నారో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ కమిషనరేట్కు ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే 15 రోజులకు ఒకసారి ఉపాధ్యాయుల హాజరు పట్టికను హెచ్ఎంలు డీఈఓ కార్యాలయానికి నివేదించాలి. దీని వల్ల 15 రోజుల్లో ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు సమయానికి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక అంతా పారదర్శకం
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో విధులకు ఎగనామం పెట్టే కొందరు ఉపాధ్యాయుల్లో అపుడే గుబులు మొదలైంది. పాఠశాలలకు దూరంగా ఉంటున్న చాలా మంది ఉపాధ్యాయులు పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే, ఉదయం పాఠశాల ప్రారంభమయ్యే సమయానికి ముందే ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంది. కానీ, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభమైన తర్వాత ఏ మధ్యాహ్నానికో చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా, సెలవులు కూడా పెట్టకుండా పాఠశాలకు ఎగనామం పెట్టి ప్రధానోపాధ్యాయుల సహకారంతో మరుసటి రోజు వచ్చి రాని రోజు కూడా హాజరు రిజిస్టర్లలో సంతకాలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోధన సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతున్నది. ఉపాధ్యాయులే సమయానికి పాఠశాలకు రాకుండా ఉన్నప్పుడు విద్యార్థుల హాజరు శాతం కూడా పడిపోతున్నది. ఇలాంటి లోపాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఆయా జిల్లాలో పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా విధానంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అధికారులు ప్రవేశ పెడుతున్నారు. ఇతర జిల్లాల్లో ఎక్సెస్ ఉన్న బయోమెట్రిక్ మిషన్లను ఈ రెండు జిల్లాలకు తరలిస్తున్నారు. వచ్చే నెల 1 వరకు వీటిని ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల అటెండెన్స్ను సెంట్రలైజ్డ్ చేయనున్నారు.
జగిత్యాల విద్యానగర్ : ఉన్నత విద్యా సంస్థల్లోనూ బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు. హాజరు శాతం ద్వారా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు. అలాగే, స్కాలర్షిప్తో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సైతం బయోమెట్రిక్లో నమోదైన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సమయ పాలన పాటించడం, సెలవులు పారదర్శకంగా తీసుకోవడానికి బయోమెట్రిక్ ఉపయోగపడనుంది. జగిత్యాల జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 2900 మంది, ద్వితీయ సంవత్సరంలో 3380 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 6280 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 14 మంది ప్రిన్సిపాళ్లు పనిచేస్తుండగా కోరుట్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్పై వెళ్లారు. కాగా, 23 మంది రెగ్యులర్, 152 మంది కాంట్రాక్ట్, 55 మంది గెస్ట్ లెక్చరర్లు, ముగ్గురు లైబ్రేరియన్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, 15 మంది రికార్డ్ అసిస్టెంట్లు, రెవెన్యూ శాఖ నుంచి సర్దుబాటులో వచ్చిన 18 మంది వీఆర్వోలు, 15 మంది అటెండర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రెండు బయోమెట్రిక్ మిషన్లతోపాటు ప్రతి కళాశాలకు నాలుగు సీసీ కెమెరాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జగిత్యాల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, బీర్పూర్, సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటినే స్వల్ప మరమ్మతులతో బాగు చేసే అవకాశాలున్నాయి. కాగా, జిల్లా కేంద్రంలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా సిబ్బందికి గత రెండు, మూడేళ్ల నుంచి బయో మెట్రిక్ విధానం అమల్లో ఉంది. తాజా, విధానం అమలైతే విద్యార్థులకు సైతం బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 440 మంది విద్యార్థులు, 20 మంది బోధన సిబ్బంది, నలుగురు నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 892 మంది విద్యార్థులు, 27మంది బోధనా సిబ్బంది, 8 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు.
హాజరు శాతం మెరుగు పడుతుంది
బయోమెట్రిక్ విధానంతో విద్యార్థుల హాజరు శాతం మెరుగు పడుతుంది. సిబ్బ ంది సమయ పాలనకు ఉపయోగపడుతుంది. గతం లో ఉన్న బయో మెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాలను స్వల్ప మరమ్మతులు చేయడం ద్వారా ఉపయోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి.
– బొప్పరాతి నారాయణ, ఇంటర్మీడియట్ విద్య జిల్లా నోడల్ అధికారి (జగిత్యాల)