మల్యాల, జూలై 20: ఉమ్మడి పాలనలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విరివిగా నిధులు మంజూరు చేస్తూ సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. కొండగట్టు హనుమాన్ ఆలయానికి నీటి వసతి కల్పించేందుకు 13.43 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వరద కాలువ వద్ద పంప్హౌస్ను నిర్మించి ఎత్తిపోతల ద్వారా సంతలోనిలొద్దిని నీటిని నింపేందుకు గాను చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్కుమార్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలనలో వేములవాడ రాజేశ్వరస్వామి. కొండగట్టు హనుమాన్, బాసర సరస్వతీ, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాలకు సకల హంగులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొండగట్టు ఆలయానికి 100 కోట్లు ప్రకటించారని, అవసరమైతే వెయ్యి కోైట్లెనా వెచ్చించేందుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందులో భాగంగా అధికారులు ప్రతిపాదించిన మేరకు 13.43 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. భవిష్యత్లో 20 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేశారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల కలెక్టర్ యాస్మిన్భాషా, ఇరిగేషన్ సీఈఈ సుధాకర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, ఇరిగేషన్ ఈఈ సుధాకిరణ్, డీఈఈ తిరుపతి, తహసీల్దార్ సుజాత, జడ్పీటీసీలు కొండపలుకుల రాంమోహన్రావు, పునుగోటి ప్రశాంతి, భూమయ్య, ఎంపీపీ స్వర్ణలత, కొండగట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, ముత్యంపేట-కొండగట్టు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల, కొడిమ్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, సహకార సంఘాల అధ్యక్షులు మేన్నేని రాజనర్సింగరావు, బోయినిపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్రావు, ముత్యాల రాంలింగారెడ్డి, బండ రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీలు రవి, పర్లపల్లి ప్రసాద్, నాయకులు లోక బాపురెడ్డి, జనగం శ్రీనివాస్, పులి వెంకటేశంగౌడ్, కొండగట్టు ఆలయ ధర్మకర్తలు ప్రవీణ్, కొంక సర్సయ్య, సురేందర్, గంగయ్య, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
నాలుగు నెలల్లో ఎత్తిపోతల పనులు పూర్తి
ఫిబ్రవరి 15న సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో భక్తులకు నీటి కొరతలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతోపాటు మిడ్మానేరు బ్యాక్వాటర్తో వరద కాలువలో 365 రోజులు నీటి లభ్యత ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే 81.1 కిలోమీటర్ మైలురాయి (ముత్యంపేట) వద్ద పంప్హౌస్ను నిర్మించి, 1.7 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా సంతలోని లొద్దిని నింపేందుకు సర్కారు నిర్ణయించింది. అక్కడి నుంచి ఫిల్టర్బెడ్ ద్వారా నీటిని శుద్ధిచేసి కొండగట్టు ఆలయానికి తరలిస్తాం. తెలంగాణ దక్కన్ పీఠ భూములకు సైతం గోదావరిజలాలను తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ అనుభవంతో అంజన్న ఆలయానికి ఎత్తిపోతల ద్వారా నీరందించే పథకానికి అంకురార్పణ చేశారు. నాలుగు నెలల్లోగా పంప్హౌస్ పనులను పూర్తి చేయిస్తాం.ఆ మేరకు కాంట్రాక్టర్ను ఆదేశించాం.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
నీటి కొరతను తీరుస్తాం
సీఎం కేసీఆర్తోనే అంజన్న ఆలయ అభివృద్ధి సాధ్యం. గతంలో ఎంపీగా కొనసాగిన వినోద్కుమార్ 333 ఎకరాల రెవెన్యూ భూమిని అంజన్న ఆలయానికి బదిలీ చేశారు. ఎమ్మెల్సీ కవిత రామకోటి స్తూప నిర్మాణానికి కృషి చేశారు. కొండగట్టు ఆలయానికి నీటి వసతి కల్పించేందుకే ముత్యంపేట శివారులో పంప్హౌస్ నిర్మిస్తున్నాం. ఇక్కడ 150 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తాం. ఈ ఎత్తిపోతల ద్వారా 13.28 ఎంసీఎఫ్టీ సామర్థ్యం ఉన్న సంతలోని లొద్ది చెరువుకు ప్రతిరోజూ 5 క్యూసెక్కుల నీటిని తరలిస్తాం. ఇక్కడి నుంచి కొండపైకి తరలిస్తాం. నీటి కొరతను తీరుస్తాం.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే