
‘Bhu Bharati’ Applications | కలెక్టరేట్, జులై 7 : భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. రెవెన్యూ శాఖలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ మంగళవారం తంగళ్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, కార్యాలయ పనితీరుపై ఆరా తీశారు.
భూ భారతి, సాదాబైనామా కింద అందిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించిన కలెక్టర్, పెండింగ్లో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అలాగే కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణ, రికార్డుల భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విధులకు సమయానికి హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ మురళి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలోని గ్రోమోర్, నేరేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఫర్టిలైజర్ యాప్ అమలు, యూరియా నిల్వలు, రైతుల బుకింగ్ వివరాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాగు అవసరాలకు అనుగుణంగా ముందుగానే బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేసిన ఆమె, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని, ఆయిల్ పామ్తో పాటు ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు.