కార్పొరేషన్, డిసెంబర్ 23: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా మున్సిపల్ పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్ రావు స్పష్టం చేశారు. నగరంలోని 14, 35వ డివిజన్లలో గురువారం ఆయన పర్యటించారు. 35వ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో వెండింగ్ జోన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం వెండింగ్ జోన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 35వ డివిజన్ సప్తగిరి కాలనీలో కూరగాయలు విక్రయానికి రూ. 42 లక్షలతో వెండింగ్ షెడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. బల్దియా పారిశుధ్య వాహనాల కోసం గతంలోనే రూ. 30 లక్షలతో షెడ్డు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.18 లక్షలతో సీసీ ఫ్లోరింగ్ పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేసి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న వాహనాలను షెడ్డుకు తరలిస్తామని స్పష్టం చేశారు.
త్వరలోనే 24 గంటల మంచి నీటి సరఫరా
నగరంలో త్వరలోనే 24 గంటలు మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. రోజూ నీటి సరఫరా ఏడాదిగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అంబేద్కర్నగర్ రిజర్వాయర్లో నిర్మించిన మంచినీటి సంపు, పంపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రెషర్తో నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్నగర్ రిజర్వాయర్లో సంపులు నిర్మించినట్లు తెలిపారు. దీని పరిధిలోని సుమారు 12 డివిజన్లకు రేపటి నుంచి ప్రెషర్తో నీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సలహాలు, సూచనల మేరకు రోజూ నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బంది రాకుండా సంపు నిర్మాణం చేపట్టి ప్రారంభించినట్లు తెలిపారు. తీగలగుట్టపల్లికి కూడా అంబేదర్నగర్ రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రిజర్వాయర్ పరిధిలో నలుగురు లీకేజీ లేబర్లను నియమిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్, కంసాల శ్రీనివాస్, నేతికుంట యాదయ్య, ఎడ్ల సరిత-అశోక్, మెండి శ్రీలత-చంద్రశేఖర్, నక పద్మ-కృష్ణ, నుజహాత్ అలీ, జహీరాబాను, గౌసియా బేగం అబ్బాస్ సమీ, షకీరా అంజూమ్ బరత్ అలీ, వంగల శ్రీదేవి-పవన్, ఇఫ్రా తహరీన్ అథీనా, ఈఈ రామన్, డీఈ మసూద్ అలీ, నాయకులు, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.