Challur | వీణవంక, ఆగస్టు 11 : ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానల రిజిస్టర్లు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు, ఫార్మసీ, పారిశుధ్యం, ల్యాబ్, ఆరేషన్ థియేటర్లను పరిశీలించి, రోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ మాట్లాడుతూ చల్లూరు ఆసుపత్రిలో ప్రభుత్వ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులపట్ల ప్రేమతో ప్రవర్తించాలని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీణవంక, చల్లూరు వైద్యాధికారులు వరుణ, సంతోష్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.