మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధారణ డిగ్రీ మాదిరిగానే మూడేళ్ల విద్యా విధానంతో ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సుల్లో చేరే అవకాశమున్నది. ఒక్కో దానిలో 40 చొప్పున 120 సీట్లను కేటాయించగా, ఏటా ఏప్రిల్, మేలో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. రిజర్వేషన్ల వారీగా సీట్లు భర్తీ చేస్తుండగా, గత విద్యా సంవత్సరం నుంచే బోధన ప్రారంభమైంది. నిష్ణాతులైన అధ్యాపకుల బోధనలో యువతులు తమ ఉజ్వల భవితకు బాటలు వేసుకుంటుండగా, కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉన్నతంగా స్థిరపడే అవకాశమున్నది.
సిరిసిల్ల తెలంగాణచౌక్, నవంబర్ 1: తంగళ్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కళాశాల ఏర్పాటైంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా ఏర్పాటైన ఈ కాలేజీ, యువతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. జనరల్ డిగ్రీ మాదిరిగా మూడేళ్ల విద్యావిధానంలో మూడు కోర్సులను (ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్, ఇంటీరియర్ డిజైనింగ్) ప్రవేశ పెట్టారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచే కాలేజీని అందుబాటులోకి తెచ్చారు. మొదటి సంవత్సరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 70 మంది విద్యార్థులు మూడు కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ యేడాది 96 మంది అడ్మిషన్లు పొంది తరగతులకు హాజరవుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తూ విద్యార్థులను ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేసేందుకు ఈ కళాశాల కృషి చేస్తున్నది. బోధన ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా రెండు జతల కళాశాల డ్రెస్లు, హైజెనిక్ కిట్స్, ఒక జత షూ, మినరల్ వాటర్, ప్రతి రోజూ గుడ్డు, నెలకు రెండుసార్లు మటన్, రెండు సార్లు చికెన్, ఉదయం పోషక విలువలు గల టిఫిన్, రెండు పూటల సన్నబియ్యంతో భోజనం, ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించడంతోపాటు మెరుగైన సౌకర్యాలతో ఉన్నత విద్యను అందిస్తున్నది.
అధునాతన పరికరాలు
వృత్తి విద్య అంటేనే ప్రయోగాత్మక చదువు. అందులో ఏమాత్రం అశ్రద్ధ వహించినా విద్యార్థి జీవితకాలం వృథా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యా బోధనకు మూడు కోర్సులకు సుమారు 50 లక్షలకు పైగా విలువైన అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. నాలుగంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ప్రతి కోర్సులో డిజిటల్ తరగతి గదులు, అధునాతన సౌకర్యాలతో ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అనుభవమున్న ఎనిమిది మంది అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు.
రిజర్వేషన్ల వారీగా సీట్లు
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో భాగంగా నడుస్తున్న ఈ కళాశాలలో అడ్మిషన్లు పొందాలంటే.. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఏటా ఏప్రిల్, మే నెలలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తారు. మొదటగా గిరిజన విద్యార్థులకు 28, బీసీలకు 5, ఎస్సీలకు 4, ఓసీలకు 1, ఎన్సీసీ, ఎక్స్సర్వీస్మెన్ పిల్లలకు ఒకటి చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ మార్కులను బట్టి సీట్లను భర్తీ చేస్తారు. ఒకవేళ భర్తీ కాకపోతే స్పాట్ అడ్మిషన్ల కోసం కళాశాలలో 200లతో మాన్యువల్గా జూలై- ఆగస్టు మాసంలో దరఖాస్తు చేసుకునే వీలుందని అధికారులు తెలిపారు.
స్వయం ఉపాధికి అవకాశాలు
జనరల్ డిగ్రీ మాదిరిగా మూడేళ్లు కొనసాగే ఈ కోర్సులను బీఏ ఆనర్స్ విభాగంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వారి అర్హతలను బట్టి ప్రభుత్వం విడుదల చేసే ఆయా పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అర్హులుగా ఉంటారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటోగ్రఫీ కోర్సులు చేసిన విద్యార్థులు టెక్స్టైల్, జర్నలిజం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో పీజీ చేసి ఈ విభాగంలో ప్రత్యేక అధ్యాపకులుగా ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడవచ్చు. వీటితోపాటు స్వయం ఉపాధిలోనూ రాణించి తమతోపాటు పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ప్రస్తుతం కొత్తగా నిర్మించే గృహాల్లో సుమారు 30 శాతం ఇంటీరియర్ డిజైనింగ్కు ఖర్చు చేస్తున్న తరుణంలో ఈ కోర్సుల్లో నిష్ణాతులైనవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు ఫొటోగ్రఫీలో రాణించడం చాలా అరుదు కాబట్టి ఇక్కడ చదివిన వారికి సినిమా రంగం, ప్రైవేట్ ప్రీ వెడ్డింగ్ స్టూడియోలు, తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి.
చాలా బాగుంది..
మాది హైదరాబాద్లోని గచ్చిబౌలి. ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్లో చదివా. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఈ కోర్సుకు సంబంధించి సిరిసిల్లలో కొత్తగా కళాశాల ఏర్పాటైందని మా రిలేటీవ్స్ ద్వారా తెలుసుకుని ఐప్లె చేశా. ఇప్పుడు సెకండియర్ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్మీడియంలో చదివా. మొదట్లో ఇక్కడ ఎలా ఉంటుందోనని కాస్త భయపడ్డా. కానీ, చాలా బాగున్నది. లెక్చరర్ల్లు మాకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఇదే కోర్సును హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజీలో చేస్తే చాలా ఖర్చయ్యేది. ల్యాబ్లో కావాల్సిన అన్ని పరికరాలు విద్యార్థులే సొంతంగా కొనుగోలు చేయాల్సి వచ్చేది.
– సీ భార్గవి, ఫ్యాషన్ డిజైనింగ్, ద్వితీయ సంవత్సరం (హైదరాబాద్)
ఇంటీరియర్ డిజైన్ అంటే ఇష్టం
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మమ్మీడాడీ వ్యవసాయం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను సరైన క్రమంలో అమర్చడం, పరిశుభ్రంగా ఉంచడం, ఇంటి ఆవరణను ఆహ్లాదకరంగా తయారు చేయడం ఇష్టం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటి నిర్మాణం కంటే ఇంట్లోని అందమైన వస్తువుల అలంకరణ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గృహ అలంకరణకు ఏ వస్తువులు కొనాలి? వాటిని ఎక్కడ అమర్చాలి? ఇంటిని ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలపై సరైన అవగాహన లేక వారు వెచ్చించిన డబ్బులు వృథాగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై ప్రావీణ్యం పొందిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కోర్సును ఎంపిక చేసుకున్నా.
– ప్రియాంక, ఇంటీరియర్ డిజైనింగ్, ద్వితీయ సంవత్సరం (భద్రాద్రి కొత్తగూడెం)
స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువ
గతేడాది నుంచే కళాశాలలో మూడు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ డిగ్రీ మాదిరిగానే ఈ కోర్సులు చేసిన వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉంటాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో వృత్తి విద్యలో ప్రయోగాత్మకమైన బోధన అందిస్తున్నాం. నిష్ణాతులైన విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అత్యాధునిక మెరుగైన వసతులు ఉన్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.
– రజినీ, కళాశాల ప్రిన్సిపాల్, ఫైన్ ఆర్ట్స్ మహిళా డిగ్రీ కళాశాల (సిరిసిల్ల)
త్వరగా సెటిల్కావచ్చు..
విద్యార్థులు ఇలాంటి కోర్సులు చేయడం వల్ల జీవితంలో త్వరగా సెటిల్కావచ్చు. నేను గతంలో ముంబైలోని నిఫ్ట్లో ఫొటోగ్రఫీ విభాగంలో బోధించా. మనం రాష్ట్రంలో ఫొటో గ్రఫీలో ప్రత్యేక కోర్సులతో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఈ రంగంలో యువతులు రాణించడం చాలా అరుదు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఇది సువర్ణావకాశం. కొంచెం శ్రద్ధ పెడితే ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవచ్చు.
– రఘు, ఫొటో డిజిటల్ మేనేజింగ్ అధ్యాపకుడు (మంచిర్యాల జిల్లా)