హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 20: దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూతతో లబ్ధిదారులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారుల ఫొటో అప్లోడ్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు దళిత బంధు యాప్లో నమోదు, అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడుతూ, దళిత బంధు పథకం ద్వారా తీసుకున్న వాహనాల ద్వారా ప్రతి నెలా ఎంత ఆదాయం వస్తున్నది, జీవన స్థితిగతుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగి వారిచ్చిన సమాధానంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హార్వెస్టర్, జేసీబీ, డీసీఎం, కారు, ఆటోలు పొందిన లబ్ధిదారులు ప్రతిరోజూ వాహనాలను నడిపి ఆర్థికంగా ఎదగాలన్నారు. దళిత బంధు యాప్లో ఫొటో, రిజిస్ట్రేషన్ వివరాలను అప్లోడ్ చేయాలని తెలిపారు. దళిత బంధు యాప్లో నమోదు చేయడంతో లబ్ధిదారులు దళిత రక్షణ నిధి ద్వారా మరింత లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్ గురించి జిల్లా రవాణా శాఖాధికారులు, సిబ్బంది లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా రవాణా శాఖాధికారి ఎం చంద్రశేఖర్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ప్రత్యేకాధికారి సురేశ్, హుజూరాబాద్ ఆర్డీవో బీ హరిసింగ్, ఎంవీఐ సిరాజ్ఉర్హ్రమాన్, క్లస్టర్ అధికారులు రాజమనోహర్, శ్రీనివాస్, మధుసూదన్, నెతానియల్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో వినతుల వెల్లువ
కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 316 మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పలు కారణాలతో పెండింగ్లో తమ సమస్యలపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు నివేదించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సత్వర పరిష్కారమార్గాలు చూపాలని సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఆయన వద్దకు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి సంబంధించి 184, జిల్లా పంచాయతీ అధికారిపై వినతులు 22, మండల పరిషత్ కార్యాలయాలపై 16, మున్సిపల్ కార్పొరేషన్ ఆప్ కరీంనగర్పై 15, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంపై 9 వినతులు రాగా, మిగతావి ఇతర ప్రభుత్వ శాఖలపై వచ్చాయి. వాటిని పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అధికారులు పాల్గొన్నారు.