కార్పొరేషన్, మార్చి 15: మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక 19వ డివిజన్లో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని బుధవారం ఆయన మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆడబిడ్డ కన్న వారికి భారం కావద్దనే సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక పథకాలను తీసుకువచ్చారన్నారు. తెలంగాణలో మహిళలు ఆనందంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా అది ఆడబిడ్డల పేరుతోనే చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే అడబిడ్డల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వచ్చే వారం నుంచి కొత్తగా గృహలక్ష్మి పథకాన్ని చేపడుతున్నామని, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు. మహిళా సంఘ భవనం కోసం ఇప్పటికే రూ.15 లక్షలు ఇచ్చామని, మొదటి అంతస్తు నిర్మాణం కోసం మరో రూ.10 లక్షల నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం రాకముందు రేకుర్తి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నారన్నారు. సమైక్య పాలనలో ఎవరు పట్టించుకోకపోవడంతో నగరాన్ని ఆనుకునే ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పక్కనే మానేరు జలాశయం పెట్టుకుని తాగునీటి కోసం బిందెలతో ట్యాంకర్ వద్ద యుద్ధాలు చేసిన పరిస్థితులుండేవని గుర్తుచేశారు. ఇప్పుడు నగరంలో రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు వస్తుండడంతో మాయగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడక తప్పదన్నారు. ఇకడి నీళ్లు, బొగ్గు, కరెంట్ను దోచుకుని మళ్లీ గుడ్డి దీపం చేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సీఎం కేసీఆర్కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎదుర్ల రాజశేఖర్, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.