కలెక్టరేట్, అక్టోబర్ 21 : రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పట్టణ ముస్లింల కోసం కొత్తపల్లి శివారులో మినీ హజ్హౌజ్, ఈద్గాల నిర్మాణం కోసం పదెకరాల స్థలం కేటాయించిన సందర్భంగా, ముస్లిం స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు.
ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గా, మినీ హజ్హౌజ్, ముస్లిం షాదీ ఖానా, కమ్యూనిటీ హాళ్లు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాల నిర్మాణం కోసం వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో అనీసుల్ గుర్భా భవనాన్ని నిర్మించి, పేదల కోసం ప్రభుత్వ పరంగా వసతి గృహం ఏర్పాటు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. గడచిన ఏడు దశాబ్ధాల్లో ముస్లింల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం పాటు పడలేదని, కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు, ముస్లింలు అంటే చిన్నచూపు చూడటమే తప్ప ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ముస్లింలను మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లడిగే హక్కులేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన గెలిచేందుకు కులాలు, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రణాళిక రూపకల్పన చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టేందుకు ముస్లిం మైనార్టీలంతా కలిసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈద్గా, మినీ హజ్ హౌజ్ నిర్మాణం కోసం వివాదాలు లేని భూమిని ముస్లింలకు అందించేందుకు కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రిని గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సన్ని మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ పాల్గొన్నారు.