విద్యానగర్, సెప్టెంబర్ 4 : సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. దీంతోపాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు (యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముడి సరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని విన్నవించారు. బుధవారం ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ను ఏర్పాటు చేయడంవల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు.
నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. యార్న్ డిపో ఏర్పాటు వల్ల సిరిసిల్లలో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తకువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులతో ముడిసరుకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బండి సంజయ్ విజ్ఞప్తికి జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80 శాతం సబ్సిడీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేరొన్నారు.