హుజూరాబాద్ టౌన్, జూలై 19 : ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్, విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ ప్లేయర్గానూ రాణించిన ఆయన, హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం హాకీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో హుజూరాబాద్ వ్యవసాయ మారెట్ కమిటీ డైరెక్టర్గా, జిల్లా టెలికాం బోర్డు మెంబర్గా పనిచేశారు.
హుజూరాబాద్ పట్టణం నుంచి రెండుసార్లు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్లో 2001లోనే చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పలు హోదా ల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పం దించి పార్టీతోపాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఆయనకు గతేడాది జూలై 23న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత దళితబంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, నూటికి 90 శాతం మందికి ఈ పథకం గ్రౌండింగ్ చేసి తన పని తనాన్ని శ్రీనివాస్ నిరూపించుకున్నారు. దాంతో సీఎం కేసీఆర్ తిరిగి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏడాదిపాటు పొడిగించారు.
ఈ మేరకు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రెండోసారి అవకాశం కల్పించడంపై సీఎం కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్కు బండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. రెండోసారి పదవి రావడంపై హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ దంపతులు కొలిపాక నిర్మల-శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.