తెలంగాణ చౌక్, జూలై 5: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని నేతన్న చౌక్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించగా, వందలాది యువతీ యువకులు, విద్యార్థులతో అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. బలగం సినిమా బృందం హాజరై, జోష్ నింపింది. దారి పొడవునా మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ నినదించారు. అనంతరం వాసవి కల్యాణ మండపంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్ కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పని చేస్తున్నదని, అందులో భాగంగానే యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ కళాశాలల్లో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడితో కూడిన యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మాదకద్రవ్యాలపై తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగహన కల్పిస్తూ ఉండాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి వ్యసనాలకు బానిసైతే వెంటనే డయల్ 100 కాల్ చేసి చెప్పాలన్నారు. ఇలాంటివారికి ప్రభావితులై ఉంటే వారిని ద్వేషించడం కాకుండా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించి మంచి జీవితాన్ని అందించేటట్లు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో సినీ హీరోలు రోల్ మోడల్గా ఉంటున్నారని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి బలగం టీంను ఆహ్వానించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల్లో 17 కేసులు నమోదు చేసి 55మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
బలగం సినిమా డైరెక్టర్ ఎల్దండి వేణు మాట్లాడుతూ, జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే డ్రగ్స్లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ ప్రభావంపై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. హీరో ప్రియదర్శి మట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్లాంటి చెడు అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తనకు రెండేళ్ల కిత్రం వరకు సిగరెట్ అలవాటు ఉండేదని, కుటుంబసభ్యుల కోసం మాని సంతోషంగా గడుపుతున్నట్లు తన స్వీయ అనుభవాన్ని విద్యార్థులకు వివరించారు. హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్ మాట్లాడుతూ, పోలీస్ జాబ్ అంటేనే ఎంతో బీజీతో కుడినదైనా ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చంద్రయ్య ,డీఈవో రమేశ్కుమార్, సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు.