కోరుట్ల రూరల్, జూన్ 28 : కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా ఆవుల పెంపకం గురించి అధ్యయనం చేసేవాడు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, తెలుగు రాష్ర్టాల్లో నెలల తరబడి పర్యటించి ఆయా రాష్ర్టాల్లో ఆవుల పెంపకం, స్థితిగతులను అక్కడి రైతులను అడిగి తెలుసుకునేవాడు. ఎప్పటికైనా స్వగ్రామంలో స్థిరపడ్డాక ఆవుల పెంపకం చేపట్టి జీవనం సాగించాలని నిర్ణయించుకున్నాడు. 2018లో సౌదీలో పని మానేసి స్వగ్రామం అయిలాపూర్కు వచ్చి తనకున్న ఎనిమిదెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
2018 నవంబర్లో ఆవుల పెంపకం చేపట్టేందుకు ధర్మారం శివారులో 1.21 ఎకరాల స్థలాన్ని కొని, ప్రత్యేక షెడ్డు వేశాడు. 15లక్షలతో గుజరాత్ నుంచి 12 గిరి ఆవులను కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. అవి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 82 ఆవులతో పాటు 26 లేగదూడలయ్యాయి. వాటి మేత కోసం రెండున్నర ఎకరాల్లో గడ్డిని పెంచుతూ, సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాడు. సురభి గోమాయి గోశాలను నెలకొల్పి నాలుగేళ్లుగా ఆవులు పెంచుతున్నాడు. ఒక్కో ఆవు రోజూ 5 నుంచి 8 లీటర్ల పాలిస్తున్నదని, మొత్తం 25 ఆవుల ద్వారా సుమారు 100 నుంచి 130 లీటర్లు సేకరించి ఒక్కో లీటర్ను 100 చొప్పున విక్రయిస్తున్నాడు. ప్రతి రోజు 10వేల నుంచి 12వేల వరకు ఆదాయాన్ని పొందుతూ, నెలకు 3లక్షలకు పైగా ఆర్జిస్తున్నాడు.
ఆవు పేడ, మూత్రంతో తన వ్యవసాయ క్షేత్రంలోని ఆరు గుంటల్లో పాలకూర, బీరకాయలు, ఆనిగపుకాయ, వంకాయ, బెండకాయ, కొత్తిమీరను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాడు. ఇంటి అవసరాలకు పోను మిగిలినవి గ్రామంలో విక్రయిస్తున్నాడు. ఇక్కడి రైతులకు సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై అవగాహన కల్పిస్తున్నాడు. తన నలుగురు కుటుంబ సభ్యులు, ఐదుగురు కూలీలతో కలిసి ఆవులను సంరక్షిస్తున్నాడు. ఆవులు సమృద్ధిగా పాలు ఇచ్చేందుకు వేరుశనగ, గోధుమ, కంది, పెసర పిండి, పశుగ్రాసం, మక్క, చెరుకు గడలు, అరటిపళ్లు, ఆయుర్వేద పదార్థాలను పెడుతున్నాడు. రోజుకు 4వేల చొప్పున ప్రతి నెలా 1.20లక్షలు మేతకు ఖర్చు చేస్తున్నాడు.
ఆవులను దేవుళ్లు, నదులు, ప్రకృతి పరమైన పేర్లు సరస్వతి, సురభి, తులసి, గంగా, యమున, గంగోత్రి, నంది, గోపాల్, ఈశ్వర్ అంటూ పిలుస్తుంటే అవి ఎంతో ఆప్యాయతగా మహిపాల్ దగ్గరకు వస్తుంటాయి. మహిళలు గోమాత పూజలను చేపట్టేందుకు ప్రతి శుక్రవారం గోశాలకు ఉదయం వచ్చి పూజలు చేస్తుంటారు. మహిళలు, భక్తులు గోశాలకు వస్తుండడంతో మహిపాల్ అక్కడే శ్రీకృష్ణుడి మందిరాన్ని నిర్మించాడు. మరోవైపు కాసులు (హంసలు), టర్కీ కోళ్ల సంరక్షణకు ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేయించాడు. అలాగే పిట్టలు, వివిధ రకాల పిచ్చుకలు, చిన్న చిన్న పక్షులు నివాసంగా ఉండడంతో వాటి సైతం సంరక్షణ చర్యలు చేపడుతున్నాడు. ఆవులకు వ్యాధులు సోకకుండా ఆయుర్వేద చికిత్సతోపాటు పశువైద్యాధికారులతో చికిత్స చేయిస్తున్నాడు. ఆవులపై ఉన్న ప్రేమతో, రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.
సురభి పేరిట స్వచ్ఛమైన ఆవు పాలు, నెయ్యిని అయిలాపూర్, ధర్మారం గ్రామంతోపాటు కోరుట్ల పట్టణంలో సుమారు వంద లీటర్లు పైన బాటిళ్లతో సరఫరా చేస్తున్నాడు. నాణ్యమైన నెయ్యిని కిలోకు 3200కు విక్రయిస్తున్నాడు. తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల వారికి నెయ్యిని ఆర్డర్పై సరఫరా చేస్తున్నాడు. నెలకు 20 కేజీల వరకు నెయ్యి విక్రయిస్తూ 64వేల ఆదాయాన్ని పొందుతున్నాడు.