‘రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. మీ ప్రాంత వరప్రదాయిని అయిన కల్వల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తాం. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఎక్కడా లేదు. అంతగొప్ప జల భాండాగారం ఇది. 55 ఏండ్ల కింద 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కల్పతరువు మత్తడికి గండిపడి నీరంతా బయటికి పోవడం బాధాకరం. వెంటనే సీఎం కేసీఆర్తో మాట్లాడి వారం, పదిరోజుల్లో నిధులు మంజూరు చేయించి వచ్చే వానకాలం కల్లా ప్రాజెక్టును సరికొత్తగా పునర్నిర్మిస్తాం’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి, సతీశ్కుమార్తో కలిసి ప్రాజెక్టు మత్తడిని పరిశీలించారు. రైతులు, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.
– శంకరపట్నం, జూలై 29
శంకరపట్నం, జూలై 29: కల్వల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సరికొత్తగా పునర్నిర్మిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ప్రకటించారు. కల్వల ప్రాజెక్టుకు గండి పడ్డ ప్రాంతాన్ని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్తో కలిసి శనివారం సందర్శించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం వినోద్కుమార్ విలేకరులతో మాట్లాడారు. 400 ఎకరాల విస్తీర్ణంలో 55 ఏండ్ల కింద నిర్మించిన ఈ ప్రాజెక్టు 3500 ఎకరాలకు వరప్రదాయిని అని పేర్కొన్నారు. 1980 తర్వాత ప్రాజెక్టు ఎగువన కాకతీయ కెనాల్ నిర్మించడంతో నిరంతరం జలకళతో కనిపిస్తున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల వీణవంక మండలంలోని 15 గ్రామాలకు పూర్తిస్థాయిలో, మరో ఐదారు గ్రామాలకు పాక్షికంగా నీరందుతుందని చెప్పారు. దురదృష్టవశాత్తూ మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు పడడం వల్ల ప్రాజెక్టుకు గండి పడి, నీరంతా బయటికిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. మత్తడి దిగువన ఇసుక మేటలతో కూడిన క్యాల్షియం డిపాజిట్స్ చేరడం వల్ల మత్తడికి పగుళ్లు వచ్చినట్లు ఇంజినీర్లు వివరించినట్లు వెల్లడించారు.
రైతులు, మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. తనతో పాటు మంత్రి గంగుల కమలాకర్, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ విషయమై సీఎం కేసీఆర్తో కూళంకషంగా చర్చించి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు. సత్వరమే ముఖ్యమంత్రితో మాట్లాడి వారం, పది రోజుల్లో నిధులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. కల్వల ప్రాజెక్టును పూర్తి రీ డిజైన్ తయారు చేయించి వచ్చే వానకాలం నాటికి ప్రాజెక్టును పటిష్టంగా నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, ప్రాజెక్టును త్వరగా పునర్నిర్మించాలని కోరుతూ స్థానిక మత్స్యకారులు, రైతులు వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీఆర్, జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాళ్ల శేఖర్గౌడ్, ఏసీపీ ఎల్ జీవన్రెడ్డి, సీఐ సంతోష్కుమార్, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ బషీరొద్దీన్, ఎస్సారెస్పీ ఏఈ రమేశ్, ఎస్ఐ పీ లక్ష్మారెడ్డి, కల్వల సర్పంచ్ దాసారపు భద్రయ్య, వీణవంక సర్పంచ్ కుమార్, శంకరపట్నం వైస్ ఎంపీపీ రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, శంకరపట్నం, వీణవంక మండలాల బీఆర్ఎస్ నాయకులు, రైతులు, మత్స్యకారులు ఉన్నారు.
రాజయ్యకు కుటుంబానికి అండగా ఉంటాం
చిగురుమామిడి, జూలై 29: నవాబుపేటలో వాగులో గల్లంతయి మృతిచెందిన ఏడెల్లి రాజయ్య కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. రాజయ్య మృతదేహానికి పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా, ఎమ్మెల్యే సతీశ్కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీఆర్తో కలిసి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, వాగులో రాజయ్య గల్లంతైన విషయం తెలుసుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారని, ఎమ్మెల్యే సతీశ్కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ముమ్మరం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ దుర్ఘటనలో రాజయ్య మృతి చెంద డం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్ర గాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరం గా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, బాధితులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఇక్కడ సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, చిగురుమామిడి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పెనుకుల తిరుపతి, నవాబుపేట స ర్పంచ్ సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీ మంకు స్వ ప్న-శ్రీనివాస్ రెడ్డి, బోయిని సది ఉన్నారు.