Nano urea | పెద్దపల్లి రూరల్, జూలై 25 : నానో యూరియా వాడకంపై అధికారులు, డీలర్లు అవగాహన పెంచుకుని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాఘవాపూర్ రైతువేదికలో శుక్రవారం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. 500 ml నానో యూరియా బాటిల్ ఒక 45 కిలోల యూరియా బస్తా కి సమానమని, పనిచేసే సామర్ధ్యం కూడా నానో యూరియాకు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది చాలా సులువుగా చాలా రకాల పురుగుమందులు, నానో డీఏపీ, నానో యూరియా, నానో జింక్ తో కలిపి పిచికారి చేసుకోవచ్చని తెలియజేశారు. రైతులు 30 రోజుల తర్వాత నానో యూరియాను వాడుకోవచ్చని, డ్రోన్ల ద్వారా కాని చేతి పంపుల ద్వారా గాని పిచికారీ చేసుకోవచ్చన్నారు.
ధర కూడా యూరియా బస్తా కంటే తక్కువగానే ఉంటుందన్నారు. ఖర్చు కూడా ఆదా అవుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల్లో పెద్ద ఎత్తున నానో యూరియా వాడకంపై శ్రద్ధ చూపేలా అవగాహన పెంచాలని డీలర్లకు, అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు శ్రీనాథ్, జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు కాంతాల అలివేణి, నాగార్జున, భాస్కర్, ప్రత్యూష, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, డీలర్లు పాల్గొన్నారు.