ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. బిల్లుల మీద బిల్లులు వేసి జలగల్లా రక్తం తాగుతున్న ప్రైవేటును తట్టుకోలేని పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం అందిస్తున్నది. రోజురోజుకూ సేవలను విస్తరిస్తూ మనిషి ప్రాణాలను హరిస్తున్న మహ్మమ్మారి క్యాన్సర్ నివారణ చికిత్సను అందిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల ఏరియా దవాఖానలో ఉచిత ‘కీమో’ థెరపీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. నాలుగు బెడ్లతో ప్రత్యేక క్యాన్సర్ డేకేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్లో అయితే 40 వేల నుంచి 50 వేలు అయ్యే చికిత్సను రూపాయి ఖర్చు లేకుండా అందిస్తుండగా, పేదలకు స్వాంతన దొరుకుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రజా ఆరోగ్యాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. సర్కారు దవాఖానాలంటే ‘నేను రాను బిడ్డో’ అంటూ పరుగులు తీసే పరిస్థితికి తెచ్చారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన ఆరోగ్య తెలంగాణ కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. సిరిసిల్ల ఏరియా దవాఖానాలో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రైవేటులో డెలివరీ అయిన మహిళలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా బిల్లులు గుంజుతున్నారు. సర్కారులో ఉచిత ప్రసవాలతోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబడ్డకు జన్మనిస్తే రూ.12 వేల నగదుతో పాటు కేసీఆర్ కిట్లు అందిస్తున్నారు. నాడు రోజుకు 200 మంది అవుట్ పేషెంట్లు వస్తే నేడు 1200కు పెరిగింది. కాగా, కరోనా కష్టకాలంలో ఎంతో మందికి మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడింది. పక్షవాతం వచ్చిన బాధితులకు హైదరాబాద్లోని నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో సిరిసిల్ల ఏరియా దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పక్షవాతం వచ్చిన వెంటనే దవాఖానకు తీసుకెళ్తే రూ.40 వేల ఇంజక్షన్ను వైద్యులు ఉచితంగా ఇచ్చి బాగు చేస్తున్నారు. తాజాగా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కీమో థెరపీ వైద్యం అందిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నట్లు వైద్య పరీక్షల ద్వారా వెల్లడైనట్లు వైద్యాధికారులు గుర్తించారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాన్సర్ను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటులో సైతం ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకుంది. హైదరాబాద్లోని ఎంఎంఏజే, బసవతారకం లాంటి క్యాన్సర్ దవాఖానలతోపాటు కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్స చేయించుకుంటారు. క్యాన్సర్కు మూడు రకాల వైద్యం ఉంటుంది. 1.సర్జరీ, 2.రేడియో థెరపీ, 3.కీమోథెరఫీ లాంటి వైద్యం అందిస్తారు. ‘కీమో’ థెరపీ కొందరికి ఏడాది పొడువునా ప్రతినెలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చికిత్స చేసుకోవాలంటే హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే వైద్యులు కీమో ఇస్తారు. కీమో ద్వారా క్యాన్సర్ రక్తకణాలను నిర్మూలిస్తారు.
ఇటీవల క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. బ్రెస్ట్, అన్నవాహిక, గొంతు, ఊపిరితిత్తులు, సర్వేకల్, లివర్, బ్లడ్, పురుషుల్లో ప్రొస్టేట్, ఇలా అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ బారిన పడ్డ వారికి ‘కీమో’థెరపీ వైద్యం చేయాల్సిందే. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ.20 వేల నుంచి రూ.40 వేల దాకా ఉంటుంది. ఒక్కొక్కరికి చికిత్సను బట్టి నెలకు ఒక్కోసారి, లేదా రెండు సార్లు ‘కీమో’ థెరపీ ఇస్తుంటారు. చికిత్స చేయించుకునే వారికి ఆరోగ్యశ్రీలో ఉచితమే అయినప్పటికీ, రానుపోను రవాణా ఖర్చులు భారమై పోతున్నాయి. బాధితులు వాహనాలు అద్దెకు తీసుకుని పోతుంటారు. పోయిన ప్రతిసారీ రూ.5 వేలకు పైగా ఖర్చు రవాణా చార్జీలకే అవుతుంది. పేదలకు మోయలేని భారం అవుతున్నందున మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని సిరిసిల్ల ఏరియా దవాఖానలో ‘కీమో’ థెరపీ వైద్య చికిత్స ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దవాఖానలో నాలుగు బెడ్లతో ప్రత్యేక గదిని కేటాయించారు. ‘కీమో’ థెరపీ డే కేర్ సెంటర్ని అధునాతన హంగులతో ఏర్పాటు చేశారు. రోజుకు పది మంది పేషెంట్లకు ఇందులో వైద్య చికిత్స చేస్తారు. బాధితులు పెరిగితే అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయనున్నారు. ‘కీమో’ థెరపీ ఇంజక్షన్ ఖరీదు రూ.20వేల నుంచి రూ. 40 వేలున్నా ఇవి సర్కారులో ఉచితంగానే ఇస్తారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా ప్రజల కోసం ‘కీమో’ థెరపీ డేకేర్ సెంటర్ను సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యులు, ఇద్దరు నర్సులను ఈ సెంటర్లో కేటాయించాం. హైదరాబాద్లో సర్జరీ చేసుకున్న వాళ్లు ‘కీమో’కు మళ్లీ వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. ‘కీమో’ చేయించుకునే క్యాన్సర్ బాధితులు తమ రిపోర్టులను తీసుకొస్తే వైద్యం అందిస్తాం. చాలా ఖరీదైన వైద్యం ఇక్కడే లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం నాలుగు బెడ్లతో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. పేషెంట్లను బట్టి బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది జిల్లా ప్రజలకు మంచి అవకాశం మంత్రి కల్పించారు. ఏరియా దవాఖానలో అన్ని రకాల జబ్బులకు వైద్యులున్నారు. మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ మురళీధర్రావు, సిరిసిల్ల ఏరియా దవాఖాన సూపరిండెండెంట్