Rasamayi Balakishan | తిమ్మాపూర్, సెప్టెంబర్ 11 : మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తన్నారని, రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మొగిలిపాలెం సర్పంచ్ తట్ల తిరుపతిపై గురువారం దాడి జరగగా రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మండల నాయకులు పరామర్శించారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ఆ పార్టీలో ఎవరూ చేరడం లేదని, దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే సూచన మేరకే దాడులు జరుగుతున్నాయన్నారు.
ఈ దాడి ముదిరాజ్, రజక జాతులపై జరిగిన దాడినని, దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్గా ఉన్న రమణారెడ్డి రైతులు యూరియా అడిగితే కూడా దాడులు చేస్తావా అని దుయ్యబట్టారు. తమ సర్పంచులు తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. కవంపల్లి సత్యనారాయణ అతన్ని పార్టీ నుంచి, సొసైటీ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితుల గురించి మాట్లాడే కవ్వంపల్లి దళితుడినైన తన దిష్టిబొమ్మ దహనం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గాన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యే రౌడీ రాజ్యం నడిపిస్తున్నాడని మండిపడ్డారు. అంతకుముందు నుస్తులాపూర్ నుండి భారీ కార్లతో ర్యాలీ తీశారు. మొగిలిపాలెం చేరుకొని ఘటనపై ఆరా తీశారు. అనంతరం సర్పంచ్ తిరుపతి ఇంటికి వెళ్లి పరామర్శించారు.