వెల్గటూర్, ఫిబ్రవరి 20: స్తంభంపల్లి మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు బెడ్షీట్ కప్పి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లి, బంధువుల కథనం ప్రకారం.. స్తంభంపల్లి గురుకుల పాఠశాలలో పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన జానకీరాం 8వతరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం రాత్రి హాస్టల్లో జానకీరాం పడుకున్నాక గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెడ్షీట్ కప్పి వీపుపై వాతలు వచ్చేలా కొట్టారు. తర్వాత లేచి చూస్తే ఎవరూ కనిపించలేదు.
ఈ క్రమంలో దెబ్బల నొప్పి భరించలేక మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ గోడదూకి పారిపోయాడు. ఆ కాసేపటికే విద్యార్థి కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు కంగారుపడ్డారు. ఎక్కడికి వెళ్లారో తెలియక వెతికారు. సమాచారం మేరకు తల్లి మమత, బంధువులు పాఠశాలకు చేరుకొని తమ కొడుకు జాడచూపాలని డిమాండ్ చేశారు.
వార్డెన్, టీచర్ల నిర్లక్ష్యానికి నిరసనగా ఆందోళన చేశారు. కానీ అంతలోనే జానకీరాం తన ఇల్లు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇంటికి వెళ్లి తల్లి తన కొడుకు శరీరంపై దెబ్బలు చూసి కన్నీరుమున్నీరైంది. హాస్టల్లో తన కొడుకుపై దాడి జరిగినా వార్డెన్లు, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంపై మండిపడింది. విద్యార్థి తండ్రి బతుకుదెరువు నిమిత్తం దుబాయ్లో ఉన్నాడు. కాగా, ఘటనపై ప్రిన్సిపాల్ రాజేశంను వివరణ కోరగా, హాస్టల్లో రాత్రిపూట విద్యార్థులు గొడవపడ్డారని, ఒకరినొకరు కొట్టుకున్నట్టు తెలిసిందన్నారు. అలాగే తల్లిదండ్రుల బెంగతో విద్యార్థి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు.