ఆగర్భ శ్రీమంతుడు.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతున్నదా..? ప్యారాచూట్ నేత.. జననేత మధ్యన పోరు సాగుతున్నదా..? అంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకం అవుననే అంటున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గుణగణాలను పోల్చి చూస్తున్నది. ఈ మట్టితోపాటు సింగరేణి కార్మికలోకంతో అనుబంధమున్న కొప్పులకు అండగా నిలిచేందుకు కదులుతున్నది.
మరోవైపు ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీకి పెద్ద పెద్ద వ్యాపారాలు తప్ప తమ కష్టాలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నది. ఈ పోటీ సమాజం కోసం పనిచేసే గుణవంతుడికి, ఆస్తులు కూడబెట్టుకునే ధనవంతుడికి మధ్య జరుగుతున్నదని స్పష్టం చేస్తున్నది. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా వీరిద్దరు పేర్కొన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ఎవరేంటో అర్థమవుతుందని చెబుతున్నది. ప్రజలు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని స్పష్టమవుతోంది.
– కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఎలాగైనా తమ జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ, బీజేపీ గోమాస శ్రీనివాస్ను బరిలోకి దింపాయి. అయితే, అభ్యర్థుల గుణగణాలపై జోరుగా చర్చ సాగుతున్నది. క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నేతగా.. ప్రజల సమస్యలే ఎజెండాగా పోరాడే నాయకుడిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న కొప్పులకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్నది. కమలం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ పేరు వినిపించడం లేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ పరిస్థితి వేరే రకంగా ఉన్నది. ఆయన ప్యారాచూట్ నేతగా ఇక్కడ పోటీ చేస్తున్నారనే చర్చ ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల్లో నడుస్తోంది.
ఆయన ఎమ్మెల్యే వివేక్ కొడుకుగా ఇప్పుడిప్పుడే ప్రజలకు పరిచయం అవుతున్నారే తప్ప.. ఈ ప్రాంతంతో గానీ, ఈ నేలతో గానీ ఆయనకు పెద్దగా సంబంధాలున్న దాఖలాలు లేవు. అంతేకాదు.. గతంలో గడ్డం వంశీ ఈ ప్రాంతానికి ఏ రూపంలోనూ సేవలు చేసిన దాఖలాలు లేవు. అంటే.. ఇతనే గడ్డం వంశీ అని పేరు చెపితే తప్ప.. ప్రజలు గుర్తించలేని పరిస్థితి అతనిది. పెద్దగా రాజకీయ అనుభవం లేక పోవడంతోపాటుగా ఈ ప్రాంత ప్రజా సమస్యలపై పట్టు లేకపోవడం, ప్రధానంగా సింగరేణి కార్మికుల తీరుతెన్నులపై అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేట్ వ్యాపారాలు చేసుకునే ఆయనకు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గ ప్రజలు కొప్పులతో పోల్చి చూస్తున్నారు. జనం నుంచి ఎదిగిన ఈశ్వర్ ఎక్కడ.. ఊడిపడ్డ వంశీ ఎక్కడ..? అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమనేతగా ఈ మట్టితో.. ప్రజలతో అనుబంధమున్న కొప్పులను గెలిపిస్తే అందుబాటులో ఉంటారని, అదే వంశీకి అవకాశమిస్తే టూరిస్టులాగా వచ్చిపోతారనే చర్చ ప్రజల్లో ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఈ ఎన్నికలు ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
గడ్డం వివేక్ కుటుంబం కేవలం అధికారం, పదవుల కోసం మాత్రమే రిజర్వేషన్ను వాడుకుంటున్నదని, వాళ్లెప్పుడూ ప్రజల కష్టాలను తీర్చలేదని, ఇప్పుడు వాళ్ల కుటుంబం నుంచి మూడో వారసుడిని గెలిపించినా ప్రయోజనమేమీ ఉండదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అదే అజాత శత్రువు, పదవులెన్ని వచ్చినా.. ప్రజల కోసం అంకితమయ్యే కొప్పులను ఆశీర్వదిస్తే సమాజం కోసం పనిచేస్తారన్న చర్చ జరుగుతోంది. గుణవంతుడెవరో.. ధనవంతుడెవరో చూడాలంటే నామినేషన్ల సందర్భంగా సమర్పించిన ఆస్తుల పత్రాలే నిదర్శంగా నిలుస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి 22.61 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నట్లు నామినేషన్లో స్పష్టం చేశారు. ఆయన వద్ద 89.04 లక్షల బ్యాంకు డిపాజిట్లతోపాటు షేర్లు, బాండ్లు పేరిట 11.38 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. భార్య రోషిణి పేరిట 4.23 లక్షల బ్యాంకు డిపాజిట్లతోపాటు ఎస్వీఏ రోషిణి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 80 వేల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ఎల్ఐసీ, ఇతరత్రా పాలసీల పేరిట వంశీకి 23.85 లక్షలు, రోషిణికి 10.50 లక్షలు ఉన్నాయి. 6.83 కోట్లు వంశీ వ్యక్తిగత రుణం తీసుకున్నారు. వంశీ పేరిట రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, అజీజ్నగర్లో 1.73 కోట్ల విలువైన మొత్తం 4.18 ఎకరాల భూమి ఉన్నది.
ఒడిశా రాష్ట్రంలోని సంభాల్పూర్ జిల్లాలో వేర్వేరు చోట్ల 6.94 కోట్ల విలువైన మొత్తం 10.09 ఎకరాల మేర భూములున్నాయి. ఇవే కాకుండా సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలో 1.30 కోట్ల విలువైన 406 చదరపు అడుగుల స్థలం, తిరుమలగిరిలో 43.44 లక్షల విలువైన 162.7 చదరపు అడుగుల స్థలాలున్నాయి. మొత్తం వీటి విలువ 4.17 కోట్లు ఉన్నట్లుగా ప్రస్తావించారు. భార్య పేరిట ఎలాంటి స్థిరాస్తులు, భూములు లేవు. భార్య పేరిట 10.50 లక్షల బీమా పాలసీ ఉంది. వంశీ వద్ద 100 గ్రాముల బంగారం (విలువ 6.80 లక్షలు), రోషిణి వద్ద 500 గ్రాముల బంగారం (విలువ 34 లక్షలు) ఉన్నట్లు తెలిపారు. అతనిపై, భార్యపేరిట ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవని నామినేషన్లో స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, ఆయన భార్య స్నేహలత పేరిట మొత్తం 5.22 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నట్టు నామినేషన్లో స్పష్టం చేశారు. ఆయన వద్ద నగదు 20 వేలు, 90.34 లక్షల చరాస్తులు, 40 లక్షల విలువైన స్థిరాస్తి ఉన్నట్టు వెల్లడించారు. కొప్పుల వద్ద 60 గ్రాముల బంగారం (3.39 లక్షలు), స్నేహలత దగ్గర 200 గ్రాముల బంగారం(11.31 లక్షలు), 75,300 విలువైన కిలో వెండి ఉన్నట్లు స్పష్టం చేశారు.
కొప్పుల పేరిట 3.5 లక్షల విలువైన రెండు ఎల్ఐసీ పాలసీలు, 28 లక్షల విలువైన ఇన్నోవా వాహనం, 30.26 లక్షల ఇన్నోవా హైక్రాస్ మాడల్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వాహనాన్ని 2023 సంవత్సరం ఎన్నికల సమయంలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 28.75 లక్షల అప్పులున్నట్టు తెలిపారు. ఆయన భార్య స్నేహలత వద్ద నగదు 15 వేలు, 2.69 కోట్ల విలువైన చరాస్తులు, 1.23 కోట్ల స్థిరాస్తులు 10.25 లక్షల విలువైన కారు ఉన్నట్లుగా వెల్లడించారు. స్నేహలత పేరిట 1.74 కోట్ల అప్పులున్నట్టు చూపారు. తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.