అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. గురువారం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పూర్తయింది. 12 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మంథని నియోజకవర్గంలో నాలుగు గంటల దాకా ఓటింగ్ సాగింది. సమయం దాటినా దాదాపు 172 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడంతో అదనంగా ఒకటీ రెండు గంటల పాటు కొనసాగించాల్సి వచ్చింది.
గతంతో పోలిస్తే ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా.. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో నాలుగు జిల్లాల యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. ఓటింగ్ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచగా, ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపోటముల అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండనుండగా, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గురువారం పోలింగ్ ఘట్టం పూర్తయింది. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. 2023 ఎన్నిలకు సంబంధించి కేంద్రం అక్టోబర్ 9న షెడ్యూల్ ఇచ్చింది. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశమిచ్చింది. 15న తుది జాబితాను విడుదల చేయగా, ఆ రోజు నుంచే ప్రచారాన్ని ఉధృతం చేసిన అన్ని పార్టీలు.. దాదాపు పక్షం రోజులపాటు తమ హోరెత్తించాయి. విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేశాయి. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఉమ్మడి జిల్లాను చుట్టుముట్టారు. భారీ బహిరంగ సభలు నిర్వహించారు. రోడ్డు షోలు, ఇతరత్రా మీటింగ్లు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగింది. 12 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ సాగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మంథని నియోజకవర్గంలో నాలుగు గంటలకే ముగిసింది. అయితే ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరడంతో ఈ నియోజకవర్గంలో రాత్రి 8 గంటల వరకు సాగింది. కరీంనగర్లోని కిసాన్గర్, సుభాష్నగర్, శంకరపట్నం మండలం ముత్తారం, కేశవపట్నం, వేములవాడతోపాటు ఫాజుల్నగర్, వీర్నపల్లి మండలంలోని కంచర్ల, వన్పల్లి, ముత్తారం మండలం ఖమ్మంపల్లి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపల్లి, కోరుట్ల, పెగడపల్లి పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా, కొద్దిసేపు అంతరాయం కలిగింది.
దీంతో అధికారులు వెంటనే కొత్తవి అందుబాటులోకి తెచ్చారు. సమస్యత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎన్నికల నిబంధనలను పక్కగా అమలు చేశారు. అన్ని పార్టీల కార్యకర్తలను పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఉంచారు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగియాల్సి ఉండగా, అప్పటికే దాదాపు 172 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. దాంతో సదరు కేంద్రాల్లో అదనంగా మరో ఒకటి రెండు గంటల పాటు సమయాన్ని ఇచ్చి ఓటు వినియోగించుకునేలా అనుమతించారు.
చెదురుముదురు సంఘటనలు మినహా జిల్లా లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆది నుంచీ ఇటు ఎన్నికల అధికారులు, అటు పోలీస్ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అక్టోబర్ 9న షెడ్యూల్ రాగా, అప్పటి నుంచే రంగంలోకి దిగారు. జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశానుసారం ముం దుకెళ్లారు. ఓవైపు ఓటర్ల జాబితాలు తయారు చేస్తూనే, వివిధ ప్రాంతాల నుంచి ఈవీఎంలను తెప్పించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.
నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకుండా డేగకన్ను వేశారు. ఇటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృత ప్రచారం చేశారు. గురువారం ఓటింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చిన్న చిన్న పొరపాట్లు మినహా అన్ని ఘట్టాలనూ విజయవంతంగా పూర్తి చేశారు. ఒక టీ రెండు చోట్ల కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం కనిపించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సద్దుమణిగించారు. ఇవి మినహా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇటు అధికారులు, అటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు జిల్లాల్లోనూ కౌటింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన అధికారులు, స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేశారు. పోలింగ్ ముగిసన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లు, వోటర్ వెరిఫైయేబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లను అర్ధరాత్రి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల ఈవీఎం, వీవీప్యాట్లను ఎస్సారార్ కాలేజీ.. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి ఈవీఎంలను నూకపల్లిలోని వీఆర్కే కాలజీ.. పెద్దపల్లి, రామగుండం, మంథని ఈవీఎంలను మంథని జేఎన్టీయూ.. సిరిసిల్ల, వేములవాడ ఈవీఎంలను తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూముల్లో భద్రపరిచారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, అప్పటి వరకు భారీ భద్రత ఉంచనున్నారు.
అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఎల్లుండి (ఆదివారం) కౌటింగ్ తర్వాతే తేలనున్నది. గురువారం పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. తాము చేసిన ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో? అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా..? రావా..? ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా..? అన్న అంశాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. తమ పార్ట ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను పిలిపించుకొని బూత్లవారీగా, సామాజిక వర్గాలవారీగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.