సిరిసిల్ల /సిరిసిల్ల టౌన్ అక్టోబర్ 27: సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మొదలు కావాల్సిన సభను మధ్యాహ్నం 12:45గంటలకు ప్రారంభించారు. అప్పటికే పట్టణంలోని 39 వార్డుల నుంచి వేలాది మంది యువతీయుకులు కదిలారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు కమిటీ అధ్యక్షుల నాయకత్వంలో తరలివచ్చారు. సుమారు వెయ్యి మంది బైక్లకు గులాబీ జెండాలు కట్టుకుని రాగా, మరో రెండు వేల మందికి పైగా ర్యాలీగా తరలివచ్చారు.
మంత్రి కేటీఆర్ సభావేదికపైకి చేరుకోగానే ఒక్కసారిగా ‘జై కేటీఆర్’ ‘జైజై రామన్న’ ‘కాబోయే యూత్ సీఎం రామన్న’ అంటూ నినదిస్తూ కేరింతలుకొట్టారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా.. అన్నచందంగా ఓటేయాలని రామన్న కోరగా, యువకులంతా కరతాళ ధ్వనులు చేస్తూ ‘రామన్న మా ఓటు నీకేనంటూ’ నినదించారు. రేవంత్రెడ్డికే గ్యారంటీ లేదని, ఆయన జైలుకు వెళ్లడం గ్యారంటీ అని.. అన్న మాటలకు కేరింతలు కొట్టారు. పదకొండు సార్లు అశకాశం కల్పిస్తే కాంగ్రెస్ ఏమి చేయలేదని, కలలో సైతం ఊహించని విధంగా సిరిసిల్లను తాను అభివృద్ధి చేశానని అమాత్యుడు చెప్పారు. నాటి నేటి ఫొటోలు చూసుకోవాలని సూచించారు. విద్యా, వైద్యం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఇది కళ్లముందు కనిపిస్తున్నదన్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
మనం చేసిన అభివృద్ధిని చూసి కూడా ఏమి జరుగలేదంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని పిలుపునివ్వగా, కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెబుతామంటూ యువకులు ఒక్కసారిగా సమాధానమిచ్చారు. ఈ 30రోజుల పాటు నా కోసం సైనికుల్లా పని పనిచేయాలని కోరగా, రెండు చేతులు పైకి లేపి ‘జై కేటీఆర్’ అంటూ నినదించారు.
రామన్న మీ వెంటే మేమున్నామంటూ చప్పట్లతో మద్దతు తెలిపారు. సభా వేదికపైనా యువ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారు. యువజన విభాగం పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిఖిందర్, రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీశ్ను మాట్లాడించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెంగని మనోహర్ గదను బహుకరించారు.
యూత్ విభాగం పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్ తల్వార్ను ఇచ్చారు. సభా ప్రాంగణంలో యువత ఓట్ఫర్ రామన్న అన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. మధ్యాహ్నం 12.50 ప్రారంభమైన సభ రెండు గంటలకు పైగా సాగినా.. యువతీ యువకులంతా రామన్న ప్రసంగిస్తున్న సేపు కదలకుండా కూర్చుకున్నారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో వేదిక బయట ఎండలో యువకులు నిలబడి ప్రసంగాన్ని ఆసక్తితో విన్నారు. ఆయన మాట్లాడినంత సేపు నిల్చున్న వారు నిల్చున్నట్లే ఉండిపోయారు. సభ ముగిసిన తర్వాత రామన్నను కలిసేందుకు యువకులు పోటీపడ్డారు. మరోవైపు సమ్మేళనానికి ముందు మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లిలో ప్రచారం చేశారు. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.