దారులన్నీ కొండగట్టు అంజన్న చెంతకే మర్లాయి. ఆదివారం జరుగనున్న హనుమాన్ పెద్ద జయంతికి రాష్ట్రం నలు మూలల నుంచి దీక్షాపరులు స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. జయంతి ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం గట్టుపైకి భక్తులు పోటెత్తారు. నియమ నిష్టలతో ఆచరించిన దీక్షలను తమ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి సన్నిధిలో విరమణ చేసి ఇరు ముడి సమర్పించారు. అనంతరం తలనీలాలు ఇచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు.
మల్యాల, మే 13 : హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టు క్షేత్రం దీక్షాపరులతో కాషాయమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో అంజన్న ఆలయం పోటెత్తింది. ఆదివారం పెద్ద జయంతి కాగా, ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం స్వామి వారి మూల విరాట్టుకు ప్రత్యేకాభిషేకంతో పాటు వేంకటేశ్వర స్వామి, అమ్మవారలకు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం యాగశాలలో స్థాపిత దేవతారాధన, హోమం, సుందరకాండ పారాయణం చేసి ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం సమర్పించారు. జయంతి ఉత్సవాల్లో ప్రత్యేకత అయిన త్రైయాహ్నిక త్రికుండాత్మక (మూడు యజ్ఞ గుండాలతో అంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి, అమ్మవారలకు) హోమాన్ని వేదపండితులు, అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ఆలయ చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామీ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్రావు, సిబ్బంది భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొండపై తిరిగారు. ఏర్పాట్లను పరిశీలించా రు. అలాగే అధ్యక్షులు, భక్తులతోనూ మాట్లాడారు. అలాగే పలు కళాబృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, కళాకారులను అభినందించారు.
అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారంతో అఖండకాలం పూర్తి చేసుకోవడంతోపాటు నేటితో ఈ కార్యక్రమం ముగియనుంది. శనివారం ఆలయ ప్రాంగణంలోని సామూహిక వ్రత మండపంలో హనుమాన్ చాలీసా పారాయణ పఠనం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయగా, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, అర్చకులు శ్రీకాంత్ నేతృత్వంలో ఉత్సవమూర్తికి ప్రత్యేకాభిషేకం నిర్వహించారు. కరీంనగర్కు చెందిన భోగ శ్రీనివాస్, మల్యాల మఠమాంజనేయస్వామి ఆలయ భజన మండలి నిర్వాహకుడు మిట్టపల్లి లక్ష్మీనారాయణలతోపాటు వారి బృంద సభ్యులు పారాయణ పఠాన్ని 11 సార్లు నిర్వహించారు. ఇక్కడ బీఆర్ఎస్ జగిత్యాల యూత్ విభాగం అధ్యక్షుడు దావ సురేశ్, జాగృతి కార్యకర్తలు నీలగిరి రాజేందర్రావు, పుల్ల తరుణ్ పాల్గొన్నారు.