పోలీసు స్టేషన్లో నేత కార్మికులు, సీఐటీయూ నాయకులు
Siricilla Arrest | రాజన్న సిరిసిల్ల, ( నమస్తే తెలంగాణ) : కూలి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న నేతన్నలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లు ప్రభుత్వం ఇచ్చింది.
15 రోజులుగా ఉత్పత్తులు ప్రారంభమైన కార్మికుల కూలి రేట్లు నిర్ణయించకపోవడంపై సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం చేనేత జౌలీ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన సిఐటియు నాయకులతోపాటు నేత కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకున్న నేత కార్మికులంతా పోలీస్ స్టేషన్కు తరలివచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూషణ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మండిపడ్డారు.