ధర్మపురి/ ధర్మారం, నవంబర్ 5: ‘రాష్ర్టాన్ని యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి హస్తంగుర్తుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖతంచేస్తరు.. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన వారిని చూసి ఆదరించాలి.’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తిచేశారు. ఆదివారం ధర్మారంలోని జిల్లా ఆర్బీఎస్ మెంబర్ పూస్కూరు రామారావు ఇంటిలో నిర్వహించిన రైతులు, గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు స్నేహ యూత్, వెల్డింగ్ దుకాణాల యజమానులతో సమావేశమయ్యారు.
300 మంది గంగపుత్ర మహిళలు, ధర్మపురి పట్టణంలో పలు యువజన సంఘాలకు చెందిన దాదాపు 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఆయాచోట్ల మంత్రి కొప్పుల మాట్లాడారు. హస్తంపార్టీ పాలనలో కరెంట్లేక, తాగు, సాగునీరందక అష్టకష్టాలు అనుభవించారని గుర్తుచేశారు. రాత్రి కరెంట్కు అనేక మంది రైతులు మరణించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. కేవలం రూ. 200 పింఛన్ ఇచ్చేవారని తెలిపారు. ఎరువుల కోసం దుకాణాల వద్ద క్యూలైన్లో చెప్పులు పెట్టాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆపార్టీ నాయకులు ఎన్నికల వేళ గ్రామాలకు వచ్చి మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నాడు చేయని వారు ఇప్పుడు ఎలా చేస్తారని నిలదీయాలని ప్రజలకు సూచించారు. కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అనేక వినూత్న పథకాలు అమలు చేశారని చెప్పారు.
మిషన్కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా నిలిచారని కొనియాడారు. గంగపుత్రులకు సమీకృత మత్స్య పథకం కింద వలలు, ద్విచక్రవాహనాలు అందించారని చెప్పారు. రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 2 వేలకు పెంచారని, మళ్లీ గెలిపిస్తే రూ. 4 వేలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించాలని పథకాలు ఇచ్చిన పార్టీని ఆదరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మండలాధ్యక్షుడు గుమ్ముల నర్సయ్య ఆధ్వర్యంలో గంగపుత్రులు మంత్రి ఈశ్వర్ను శాలువాతో సన్మానించారు. సంఘం మండలాధ్యక్షుడు నర్సయ్య , పత్తిపాక సర్పంచ్ బద్దం సుజా అధ్వర్యంలో మహిళలు, ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీజేపీ యూత్ నాయకుడు దేవి సాయి పృథ్వీ, గురుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్యాక్స్ చైర్మన్ బలరాంరెడ్డి, ఆర్బీఎస్ మండల సభ్యుడు పాక వెంకటేశం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.
వీరికి అమాత్యుడు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బాస తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు సభ్యుడు జైన రాజమౌళి ఉన్నారు. పార్టీలో చేరినవారిలో నరెడ్ల విక్రమ్, నరెడ్ల సాయి, మాడురి మధు, రెంటం నితిన్, జీవన్, చిన్ని, రిజ్వాన్, పవన్ ఉన్నారు.