సిరిసిల్ల కలెక్టరేట్/ పెద్దపల్లి కమాన్, జనవరి 4 : ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ నెల 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి ఎం గౌతమ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
వచ్చే నెల 11న ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో 100 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే ఇవ్వాలని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2023 24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదివి ఉండాలని, నాలుగో తరగతి ధ్రువీకరణ పత్రం బోనఫైడ్ను దరఖాస్తుతోపాటు అప్లోడ్ చేయాలని తెలిపారు.
విద్యార్థుల ఎంపిక పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించి చేస్తారని, ఇతర సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678కు లేదా సంబంధిత జిల్లా ప్రధాన ఆచార్యులను సంప్రదించాలని కోరారు. అలాగే సిరిసిల్ల కలెక్టరేట్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులకు సంబంధించి ప్రచార పోస్టర్ను అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, డీపీఆర్వో ఎం దశరథం, సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయకర్త జాక్వెలిన్ ఆవిష్కరించారు.