కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 19 : జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయంలో నిద్రించి, సోమవారం ఉదయం జరిగిన సుప్రభాత, అన్నకూఠోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం, యాగశాలలో సుదర్శన హోమంలో మంత్రి సతీమణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారు సింహ వాహనంపై, సాయంత్రం హనుమత్ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. రాత్రి ఉత్సవమూర్తుల ముందు సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా కొనసాగింది. కార్యక్రమాల్లో ఈవో వుడుతల వెంకన్న, వ్యవస్థాపక వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, నాయకులు అంజన్కుమార్, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.