ముస్తాబాద్, మే 9: గోడలపై అందమైన ఆట బొమ్మలు, పిల్లల చిత్రాలు చూసి కార్పొరేట్ ప్లేస్కూల్ అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపడినట్టే! ఇది నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులు, గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణ కేంద్రాలుగా మారుతున్న అంగన్వాడీ కేంద్రాలు నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో మరింత సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. కార్పొరేట్ ప్లేస్కూళ్లను మరిపించేలా ముస్తాబవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూల్ తరహాలో తీర్చిదిద్దాలనే మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు.
25 లక్షలతో గూడెం అంగన్వాడీ కేంద్రం, 4.75 లక్షలతో నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం-3ను వినూత్నంగా తీర్చిదిద్దారు. పాత భవనాలకే కొత్త రంగులు వేశారు. కావాల్సిన వసతి, సౌకర్యాలు కల్పించారు. చిన్నారులను ఆకర్షించేలా గోడలపై రంగురంగుల బొమ్మలను వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. దీంతో ఇన్నాళ్లూ కేంద్రాలకు వచ్చేందుకు మారాం చేసిన చిన్నారులు ఇప్పుడు సంతోషంగా హాజరవుతున్నారు. ఒక్కో కేంద్రానికి నిత్యం 25 మందిపైనే వస్తూ తీరొక్క వస్తువులతో ఆటలాడుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.