Ponnam Prabhakar | చిగురుమామిడి, జూన్ 18 : చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తహసీల్దార్గా రమేష్ పని చేసిన సమయంలో మండల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశాడని, కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ పనులను జాప్యం చేశాడని ఆరోపించారు.
భూమి రిజిస్ట్రేషన్లు, ఇండ్ల పర్మిషన్లు, నాలా కన్వెన్షన్ లకు డబ్బులు తీసుకుని పనిచేశాడని, నిబంధనలకు విరుద్ధంగా అనేక పనులు చేపట్టిన తహసీల్దార్ తీరుపై విచారణ చేపట్టాలని కోరారు. పలు గ్రామాల్లో సర్వేయర్లను, పార్టీల నాయకులను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని పనులపై వచ్చే వారి వద్ద నుండి డబ్బులు రాబట్టాడని అన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం ఆర్భాటం చేసినప్పటికీ పనులలో మాత్రం జాప్యం జరిగందన్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు తహసీల్దార్ ను చిగురుమామిడి మండలానికి నియమించలేదని, చాలాకాలంగా డిప్యూటీ తహసీల్దార్ రావడం లేదని, రెండు పోస్టులు ఖాళీగా ఉండటంతో వివిధ సమస్యలపై వచ్చే వారు, వివిధ సర్టిఫికెట్ల జారీ పెండింగ్లో ఉందని వాపోయారు. కార్యాలయంలో సిబ్బంది తీరు బాగోలేదన్నారు.
తహసీల్దార్ బదిలీ అయితే ఘనంగా వీడ్కోలు చేయాల్సిన ప్రజలు బాణసంచా స్వీట్ల పంపిణీ తో నిరసన తెలుపడం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు. మంత్రి పొన్నం ఇలాకాలో మంచి గుర్తింపును తీసుకురావాల్సిన తహసీల్దార్ అవినీతి డబ్బులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, కూతురు శరభందర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు సర్వర్ పాషా, సుందరగిరి ఆలయ మాజీ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.