పెద్దపల్లి, ఆగస్టు 2: ప్రాణాలకు తెగించి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడిన మత్స్యకారుల సాహసం ప్రశంసనీయమని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మండలంలోని గో పాల్పూర్ శివారులోని మానేరులో చిక్కుకున్న 19 మందిని కాపాడిన మత్స్యకారులు ఎం శ్రీనివాస్, జునుగారి రవి, గడ్డం వెంకటేశ్, జీ సందీప్ కుమార్, అరువ సాయి వంశీ, పోలీసు సిబ్బందిని బుధవారం కలెక్టర్ తన చాంబర్లో ఘనంగా సన్మానించారు. ఒక్కొక్కరికి 5వేల చొప్పున ఐదుగురికి ప్రోత్సాహకం అందించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వరదల సమయంలో మంథనికి చెందిన మత్స్యకారులు గొప్ప సేవలందించి ప్రాణనష్టం జరగకుండా చూశారని ప్రశంసించారు. వరదల సమయంలో తాము రక్షించుకునే విధంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు, అవగాహన కల్పించాలని వారిని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించేందుకు రా వాలని విజ్ఞప్తిచేశారు. మీరు కాపాడిన ఒకో ప్రా ణం వెనుక అనేక మంది ఆనందంలో ఉన్నారన్నారు. ఐదుగురు సభ్యుల కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం తీసుకొని ప్రభుత్వం అందించే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంథని ఆర్డీవో వీ హనుమా నాయక్, ఆర్డీవో ఆఫీస్ ఏవో రవీందర్, మంథని ఇన్చార్జి తహసీల్దార్ గిరి ఉన్నారు.
ఎనిమిది గంటలపాటు శ్రమించి కాపాడినం
గత నెల 27న భారీ వర్షం పడ్డది. మానేరు ఉప్పొంగి మంథని మండలం గోపాల్పూర్ ఇసుక క్వారీలోకి వరద వచ్చింది. రానురానూ ప్రవాహం పెరిగింది. దాంతో అక్కడ ఉన్న 19మంది డ్రైవర్లు వరదలో చిక్కుకున్నరు. వాళ్లను కాపాడాలని అధికారులు మమ్మల్ని పిలిచిన్రు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నది. అయినా లెక్క చేయకుండా వరదలో బోట్లలో వెళ్లినం. ఎనిమిది గంటలపాటు శ్రమించి చిక్కుకున్న వారిని కాపాడినం. మేము చేసిన సాహసాన్ని కలెక్టర్, ఇతర అధికారులు గుర్తించిన్రు. మమ్ముల సన్మానించిన్రు. చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన విద్యను ఇతరుల క్షేమం కోసం ఉపయోగించడం మాకు సంతృప్తినిచ్చింది.
-ఎరువాక సాయివంశీ, గోదావరి రివర్ రెస్క్యూ సర్వీసెస్ లైఫ్ సేవింగ్ సొసైటీ సభ్యుడు (గోదావరిఖని)
మా సాహసాన్ని గుర్తించిన్రు
వరదలో చికుకున్న వారిని కాపాడాలని అధికారులు మమ్మల్ని తీసుకెళ్లిన్రు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా మేము వారిని బయటికి తీసుకొచ్చినం. స్పీడ్ బోట్ నడుపుతున్న సమయంలో నేను ఒక సారి వరద ప్రవాహానికి కింద కూడా పడ్డ. అయినా నే ను భయపడకుండా రక్షణ చర్యల్లో పాల్గొ న్న. వరదలో చిక్కుకున వారిని రక్షించినం. మేము చేసిన సాహసాన్ని కలెక్టర్ గుర్తించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది.
-మూగ శ్రీనివాస్, బోయినిపేట (మంథని)