చందుర్తి, ఆగస్టు 20: ఫీట్న్నర జాగ కోసం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జాగను పెద్ద కొడుకుకు ఆస్తుల పంపకంలో ఇచ్చేది ఉండగా, తల్లిదండ్రులను పెద్ద కొడుకు, కోడలు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య(69), లక్ష్మీనర్సవ్వ(60) దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాత ఇంటి వెనకాల పెద్ద కొడుకు కొత్తగా ఇంటిని నిర్మించుకొని ఉంటున్నాడు.
పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు ఫీట్న్నర జాగ ఇవ్వాల్సి ఉండగా తనకు రావాల్సిన 18 ఇంచుల జాగను ఇల్లు కూల్చి వేసి ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. శనివారం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి మల్లన్న దేవుడిని తీసుకెళ్తామని, ఇల్లును కూల్చివేయాలని వాగ్వాదానికి దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు తలుపులు పెట్టుకొని శనివారం రాత్రి ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి దిగి చూసేసరికి విగతజీవులై పడి ఉన్నారు. ఈ విషయమై చిన్న కొడుకు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.
ఒకే చితిపై దంపతులకు అంత్యక్రియలు
ఒకే చితిపై వృద్ధ దంపతుల మృతదేహాలను నిర్వహించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకున్నది. గ్రామంలో అందరితో అన్యోన్యంగా ఉండే దంపతులు ఫీట్న్నర జాగ కోసం ఆత్మహత్యకు పాల్పడడం బాధకరమని వాపోయారు.